సుచరితకు మద్దతుపై మార్పులేదు: వైఎస్సార్ సీపీ

4 May, 2016 03:26 IST|Sakshi
సుచరితకు మద్దతుపై మార్పులేదు: వైఎస్సార్ సీపీ

సాక్షి, హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికపై తమ పార్టీ విధానంలో ఎలాంటి మార్పు లేదని, దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితకు మద్దతు కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ స్పష్టం చేసింది. చట్టసభల సభ్యులు మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులే అభ్యర్థి అయితే పోటీ పెట్టరాదన్నది తమ పార్టీ ఆవిర్భావం నుంచి అనుసరిస్తున్న విధానమన్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సుచరిత పోటీ చేస్తున్నందున ఆమెకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ గతంలోనే నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేసింది. వైఎస్సార్‌సీపీ, తెలంగాణ విభాగం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైదొలగిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు సంబంధించి తమ పార్టీ విధానంలో ఎలాంటి మార్పు లేదని మంగళవారం ఓ ప్రకటనలో పునరుద్ఘాటించింది.

మరిన్ని వార్తలు