సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడంలో విశేష కృషి చేసిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు జాతీయ పురస్కారం దక్కింది. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ 4వ జాతీయ దివస్ ఢిల్లీలోని విజ్ఞానభవన్లో బుధవారం జరిగింది. బ్యాంకుల సహకారంతో గ్రామీణ స్వయం ఉపాధిశిక్షణ సంస్థల ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు తెలంగాణ సెర్ప్కు ఈ అవార్డు లభించింది.
ఈ అవార్డు ను సెర్ప్ డైరెక్టర్ బాలయ్యకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అందజేశారు. రాష్ట్రాల మధ్య పోటీ తత్వాన్ని పెంచే లక్ష్యంతో ప్రతి సంవత్సరం వివిధ సంస్థలు, బ్యాంకులకు కేంద్రం అవార్డులు ఇస్తోంది. గత మూడేళ్లలో గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పించడంలో అగ్రగామిగా తెలంగాణను కేంద్రం గుర్తించింది. సెర్ప్ ద్వారా 32 వేల మంది యువతకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణకు ఈ అవార్డు దక్కడం పట్ల పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు.