పుస్తక పఠనం.. ప్రగతికి సోపానం

17 Jan, 2018 04:03 IST|Sakshi
బుక్‌ ఫెయిర్‌కు సిద్ధమవుతున్న స్టాళ్లు

     రేపటి నుంచి 28 వరకు జాతీయ పుస్తక మహోత్సవం 

     ఎన్టీఆర్‌ స్టేడియంలో కొలువుదీరనున్న 31వ ప్రదర్శన

సాక్షి, హైదరాబాద్‌:  31వ జాతీయ పుస్తక ప్రదర్శన ఈ నెల 18 నుంచి 28 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కొలువుదీరనుంది. ఇందులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరొందిన పుస్తక సంస్థలు పాల్గొననున్నాయి. ఈ ఏడాది 333 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 50కి పైగా జాతీయ స్థాయి పబ్లిషర్స్, 25 పిల్లల పుస్తక సంస్థలు పాల్గొననున్నాయి. బాలల సాహి త్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం తదితర రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్ర, గ్రంథాలపై పాఠకులు ఎంతో మక్కువ చూపుతున్నారని హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కమిటీ ప్రతినిధి కోయ చంద్రమోహన్‌ ‘సాక్షి’తో చెప్పారు.  

డాక్టర్‌ సినారె వేదిక, వట్టికోట ప్రాంగణం
భరత నాట్యం, కూచిపూడి, స్టోరీ టెల్లింగ్‌ వంటి కార్యక్రమాలతో పాటు వివిధ జిల్లాలకు చెందిన కళారూపాలను ప్రదర్శిస్తారు. 10 రోజుల పాటు పెద్ద సంఖ్యలో పుస్తక ఆవిష్కరణలు, ప్రత్యేక సదస్సులు ఉంటాయి. ఈ ఏడాది హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన వేదికకు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి వేదికగా నామకరణం చేయనున్నా రు. మొత్తం ప్రాంగణానికి వట్టికోట ఆళ్వార్‌ స్వామి పేరుపెట్టనున్నారు. పుస్తక ఆవిష్కరణలు, సదస్సులు జరిగే వేదికకు సామల సదాశివ సాహి త్య ప్రాంగణంగా, వేదికకు బోయ జంగయ్య వేదికగా నామకరణం చేయనున్నారు. ప్రదర్శనకు ఆహ్వానం పలికే రెండు స్వాగత తోరణాలకు ప్రముఖ రచయితలు, పాత్రికేయులు అయిన అలిశెట్టి ప్రభాకర్, అరుణ్‌సాగర్‌ పేరు పెట్టనున్నారు. ప్రధాన ద్వారానికి తొలి తెలుగు రచ యిత్రి భండారు అచ్చమాంబ పేరు ఖరారు చేశా రు. గురువారం ప్రారంభం కానున్న ఈ పుస్తక మహోత్సవానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 

పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు
పిల్లల్లో పుస్తక పఠనాన్ని పెంచేందుకు  స్టోరీ టెల్లింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు వంటివి నిర్వహిస్తున్నారు. కొత్తగా ‘బుక్‌ హంట్‌’ను ఏర్పాటు చేయనున్నారు. పిల్లలకు రెండు పుస్తకాల పేర్లు చెబుతారు. వాటిని వెతికి ఇచ్చిన వారికి పుస్తక బహుమతులను అందిస్తారు. ప్రతి రోజూ మధ్యా హ్నం 2:30 నుంచి రాత్రి 9 వరకు ప్రదర్శన కొనసాగుతుం దని హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ కమిటీ అధ్యక్షుడు జూలూ రు గౌరీశంకర్‌ తెలిపారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 వరకు ఉంటుందన్నారు. విద్యార్థులు తమ స్కూల్‌ గుర్తింపు కార్డులు చూపిం చి ఉచితంగా ప్రదర్శనలో పాల్గొనవచ్చన్నారు. సాధారణ సందర్శకులు రూ.5 ప్రవేశ రుసుము చెల్లించాలన్నారు.   

మరిన్ని వార్తలు