20న నయీం బాధితుల ధర్నా

18 Sep, 2016 20:19 IST|Sakshi

- నయీంతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేయాలి
- టిపిఎఫ్ అధ్యక్షులు నలమాస కృష్ణ
సుందరయ్య విజ్ఞాన కేంద్రం(హైదరాబాద్ సిటీ)

 నయీంతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులను వెంటనే అరెస్ట్ చేసి సమగ్రమైన న్యాయ విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం టీపీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో టీపీఎఫ్ అధ్యక్షులు నలమాస కృష్ణ మాట్లాడుతూ దోషులు ఎంతటివారైనా అరెస్ట్ చేసి శిక్షించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. నయీంను చేరదీసి పెంచి పోషించిన చంద్రబాబు నాయుడు, ఆనాటి పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేయాలన్నారు. అధికార పక్షంలో ఉన్న నేతలు నేతి విద్యాసాగర్, కర్నె ప్రభాకర్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చింతల వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి డికే అరుణ లాంటి వారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నయీం డైరీలో ఉన్న పేర్లు, వారు పాల్పడిన నేరాలను బయట పెట్టాలని కోరారు. నయీం బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 20న అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విలేకర్ల సమావేశంలో టిపిఎఫ్ ప్రధాన కార్యదర్శి మెంచు రమేష్, ఉపాధ్యక్షులు కె. రవిచందర్, టివివి అధ్యక్షులు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు