ఆకతాయిలపై కఠిన చర్యలకు కొత్త చట్టం

4 Jul, 2017 00:50 IST|Sakshi
ఆకతాయిలపై కఠిన చర్యలకు కొత్త చట్టం
ప్రతిపాదనలను కేంద్రానికి పంపాం: డీజీపీ
 
హైదరాబాద్‌: మహిళలను వేధించే ఆకతాయిలు, పోకిరీలపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డీజీపీ అనురాగ్‌ శర్మ పేర్కొన్నారు. ఇందుకు ‘యాంటీ ఈవ్‌ టీజింగ్‌ యాక్ట్‌’పేరుతో మరింత కఠినమైన చట్టాన్ని రూపొందించి కేంద్రం ఆమోదానికి పంపినట్లు తెలిపారు. ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌వో) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని తాజ్‌డెక్కన్‌ హోటల్‌లో ‘బీ బోల్డ్‌ ఫర్‌ ఛేంజ్‌’పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత చట్టాల వల్ల పెద్దగా ఉపయోగం లేదని, స్వల్ప ఫైన్‌ చెల్లించి ఈవ్‌టీజర్లు తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు.

తాము కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో కనీసం 10 వేల నుంచి 15 వేల అపరాధ రుసుము, జైలు శిక్ష ప్రతిపాదించినట్లు తెలిపారు. మహిళల రక్షణ, వారి హక్కులు కాపాడేందుకు పలు చట్టాలు అమలు అవుతున్నాయని, వాటిపై చదువుకున్నవారికి కూడా సరైన అవగాహన లేకపోవడం విచారకరమని అదనపు పోలీస్‌ కమిషనర్‌ స్వాతి లక్రా అన్నారు. మొత్తం పోలీసుల్లో మహిళలు 5 శాతం కంటే తక్కువగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. వరకట్న వ్యతిరేక చట్టాలను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవమే అని డీజీపీ అన్నారు. కార్యక్రమంలో సంస్థ చైర్‌పర్సన్‌ కామినీ షరాఫ్‌ తదితరులు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు