సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది (2018లో) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పరీక్షల నిర్వహణకు జేఈఈ అపెక్స్ బోర్డును (జేఏబీ) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు ఐఐటీ మద్రాసు మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.ఎస్. అనంత్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని పేర్కొంది. ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో కొనసాగే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం కేంద్రం జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను 2013 నుంచి నిర్వహిస్తోంది. అయితే 2018–19 విద్యా సంవత్సరం నుంచి చేపట్టే ప్రవేశాల కోసం 2018లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల నిర్వహణకు కొత్త అపెక్స్ బోర్డును కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మావన వనరుల అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ జేఈఈ అపెక్స్ బోర్డు
గౌరవాధ్యక్షుడు: ప్రొఫెసర్ ఎం.ఎస్. అనంత్, ఐఐటీ మద్రాసు మాజీ డైరెక్టర్, మెంబర్ సెక్రటరీ: సీబీఎస్ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సభ్యులు: ఐఐటీ బాంబే, కాన్పూర్, ఖరగ్పూర్, ఎన్ఐటీ వరంగల్, ఎన్ఐటీ సూరత్కల్, ఎన్ఐటీ తిరుచ్చి, ట్రిపుల్ఐటీ ఢిల్లీ డైరెక్టర్లు, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, బిట్, మెస్రా, రాంచీ డీమ్డ్ యూనివర్సిటీల ప్రతినిధులు, సీబీఎస్ఈ చైర్మన్, నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ డైరెక్టర్ జనరల్, సీ–డాక్ డైరెక్టర్ జనరల్, ఎంహెచ్ఆర్డీ అదనపు కార్యదర్శి/సంయుక్త కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.