పండుగకు పప్పన్నమెట్ల..?

1 Sep, 2014 02:28 IST|Sakshi

ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్‌‌స హుష్‌కాకి
 
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఓవైపు అప్పులు... మరోవైపు నష్టాల బూచి చూపి ఇప్పటికే వారి భవిష్య నిధి (పీఎఫ్), అంతర్గత రుణ నిధి (సీసీఎస్) మొత్తాలను జీతాల కింద చెల్లించిన యాజమాన్యం పండుగపూట పప్పన్నమూ దొరకకుండా మరో షాక్ ఇచ్చింది. అత్యంత ఘనంగా నిర్వహించుకునే దసరా ఖర్చుల కోసం ఏటా యాజమాన్యం ముందస్తుగా చెల్లించే పండుగ అడ్వాన్‌‌సను ఈసారి ఎగ్గొట్టింది. ఆర్థిక ఇబ్బందుల సాకుతో దసరా అడ్వాన్‌‌సను ఈసారి చెల్లించలేమని తేల్చి చెప్పింది.
 
ఆగస్టు నెల జీతంతో ఎప్పటిలాగే.. ఈసారి కూడా అడ్వాన్‌‌స అందుతుందని ఎదురుచూసిన కార్మికులు ఈ నిర్ణయంతో కంగుతిన్నారు. ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, క్లర్కులు, సూపరింటెండెంట్లకు ఒక్కొక్కరికి రూ.మూడు వేలు చొప్పున, అటెండర్లు, శ్రామిక్‌లకు రెండున్నర వేల చొప్పున ఆర్టీసీ ముందస్తుగా పండుగ అడ్వాన్‌‌స చెల్లిస్తుంది. దీన్ని వాయిదాల రూపంలో పది నెలల్లో తిరిగి వసూలు చేసుకుంటుంది. ఈసారి దసరా అడ్వాన్‌‌స చెల్లించాలంటే రూ.45 కోట్లు అవసరం. వచ్చే నెలలో జీతాల చెల్లింపే కష్టంగా మారిన తరుణంలో ఈ మొత్తాన్ని కేటాయించడం సాధ్యం కాదని తేల్చిన యాజమాన్యం ఈ నిర్ణయానికొచ్చింది.

మరిన్ని వార్తలు