హైదరాబాద్ : నగరంలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మాసబ్ ట్యాంక్ శాంతినగర్లోని శ్రీదుర్గా కనుమిల్లి అపార్ట్మెంట్లో ఆదివారం మధ్యాహ్నం బైక్పై వచ్చిన గుర్తు తెలియని దుండగుడు మన్మథ్ దాలియా అనే వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యాడు. కాల్పుల్లో గాయపడిన వ్యక్తి కేబీఎస్ బ్యాంకు సీఈవోగా ఉన్నారు.
ఆదివారం మధ్యాహ్నం దుండగుడు అపార్ట్మెంట్ వాచ్మెన్ను సంప్రదించి మన్మథ్ ఇంట్లోకి ప్రవేశించాడు. మన్మథ్తో దుండగుడు పది నిమిషాల పాటు మాట్లాడిన అనంతరం ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మన్మథ్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే అతడ్ని వైద్యం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నోట్ల మార్పిడియే కాల్పులకు కారణమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.