వాటిని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరిన విపక్షాలు
సాక్షి, హైదరాబాద్: ‘రోడ్డుకు ఇరువైపులా మద్యం దుకాణాలు ఉండటం ప్రమాదాలకు కారణం అవుతోంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వాటిని తొలగించాలి’ అని విపక్ష సభ్యులు కోరారు. గురువారం శాసన మండలిలో జాతీయ రహదారులపై స్వల్పకాల చర్చ జరిగింది. దీనిపై బీజేపీ సభ్యులు రామచందర్రావు, ఎంఐఎం సభ్యులు జాప్రీ, కాంగ్రెస్ సభ్యులు రాజగోపాల్రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వివరణ ఇచ్చారు.
హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఉన్న రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్న జాతీయ రహదారి 65 మీద చిట్యాల్, చౌకపల్లి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జీల నిర్మాణం చేపడతామన్నారు. హైదరాబాద్– శ్రీశైలం రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని నివేదించామని తెలిపారు. హైదరాబాద్కు 50 కి.మీ దూరంలో 390 కి.మీల రింగ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నట్లు ప్రకటించారు.