మా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించాలి

19 Nov, 2014 01:10 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు పంచాయతీ వర్కర్ల వినతి

సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీలలో ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న పంచాయతీ వర్కర్ల సర్వీసులను క్రమబద్ధీకరించే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని వైఎస్సార్‌సీపీ అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం ఈ సంఘం ఖమ్మం జిల్లా ములకలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో.. ఎమ్మెల్యే తాటికి హైదరాబాద్‌లో వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సేవలలో గిరిజన, బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన వారున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ అధినాయకత్వం పేర్కొన్నందున ఈ అంశాన్ని శాసనసభలో ప్రస్తావించాలని కోరారు. తమ వినతిని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు