పెన్షన్... టెన్షన్...

11 Dec, 2014 00:41 IST|Sakshi
పెన్షన్... టెన్షన్...

మొక్కుబడిగా పింఛన్ల పంపిణీ    బ్యాంకుల్లో జమకాని నగదు
మంత్రుల కోసం మరి కొన్ని చోట్ల వాయిదా  లబ్ధిదారుల పడిగాపులు

 
సిటీబ్యూరో: నగరంలో బుధవారం చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారింది. అనేక ప్రాంతాల్లో విచారణ పూర్తి కాకపోవడం... అందరికీ మంజూరు కాకపోవడం... ప్రజల నిరసనలతో ఈ కార్యక్రమానికి ఆటంకాలు ఎదురయ్యాయి. రోజంతా ఎదురు చూసి విసిగి వేసారిన లబ్ధిదారులు నిరాశతో ఇంటిముఖం పట్టారు. గ్రేటర్‌లోని మారేడుపల్లి, సికింద్రాబాద్, ముషీరాబాద్ మండలాలు, ఎల్బీనగర్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించలేదు. మారేడుపల్లి, ముషీరాబాద్‌లకు సంబంధించి బ్యాంకుల్లో  సంబంధిత మొత్తం జమ కాకపోవటంతో పంపిణీ చేయలేదు. సికింద్రాబాద్, మరికొన్ని ప్రాంతాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవటంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 10 నుంచి రెండు నెలల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంతో గ్రేటర్‌లోని పింఛన్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు బుధవారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గంటల తరబడి ఎదురు చూశారు. అధికారులు రాకపోవటంతో ఆందోళనకు గురయ్యారు. ఒక దశలో ఆగ్రవేశాలు వ్యక్తంచేశారు. కొన్ని కేంద్రాలలోనైతే నిరసనలకు దిగారు. ఈ పరిస్థితి సమూర్‌నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, మారేడుపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ జిల్లాలో పింఛన్ల పంపిణీకి 130 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 30 చోట్ల పంపిణీ చేయలేదు. హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో త హశీల్దారుల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుండగా.. శివారు ప్రాంతాల బాధ్యతను జీహెచ్‌ఎంసీ అధికారులు తీసుకున్నారు. అయితే వారు దిల్‌షుక్‌నగర్ మినహాయించి ఎక్కడా పంపిణీ చేయలేదు.

నగరంలో 7,900 మందికి...

నగరంలో బుధవారం 7,900 మందికి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ జిల్లాలోని 13 మండలాల పరిధిలో 6,900 మందికి... శివారు ప్రాంతాల్లో వెయ్యి మందికి అందజేసినట్లు అధికారవర్గాల సమాచారం. ఈ కార్యక్రమం ఈ నెల 15 వరకు కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు పింఛన్లు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నందినగర్ గ్రౌండ్‌లో పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆనందం వ్యక్తం చేశారు. షేక్‌పేట మండల పరిధిలో బుధవారం మూడు చోట్ల అర్హులకు పింఛన్లు పంపిణీ చేశారు. అక్కడ 800 మందికి వీటిని అందజేశారు. బహదూర్‌పురా మండలంలో అత్యధికంగా పంపిణీచేసినట్లు తెలుస్తుంది. అమీర్‌పేట, అంబర్‌పేట, చార్మినార్, పాతబస్తీల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. హైదరాబాద్ జిల్లాలో దీన్ని కలెక్టర్ ముఖేష్‌కుమార్ పర్యవేక్షించారు.
 
ఎన్ని వింతలో...

ఆసరా కార్డుల్లో వింతలు చోటు చేసుకున్నాయి. కుత్బుల్లాపూర్ మండలంలోని కొంపల్లిలో ఇద్దరు వితంతువులకు జారీ చేసిన ఆసరా కార్డులపై యువకుడు, పాఠశాల విద్యార్థినిల ఫొటోలు ముద్రించారు. దీంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు. గుడిపల్లి ప్రమీల(38) కార్డుపై యువకుడి ఫొటో దర్శనమివ్వగా.... బాలోని నీరజ(33) కార్డుపై చిన్నారి ఫోటో ఉంది. ఈ విషయంపై ఎంపీడీఓ కె.అరుణను ‘సాక్షి’ వివరణ కోరగా... అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న ఎవరిదో ఒక ఆధార్ నెంబరు ఇస్తే నోట్ చేసుకుని వచ్చి కంప్యూటర్‌లో పొందుపరిచారని తెలిపారు. ఈక్రమంలో తప్పులు దొర్లాయని అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు.
     
ఉప్పల్‌లో సర్కిల్‌లోని వెంకట్‌రెడ్డి నగర్, రామాం తానపూర్‌లకు చెందిన వికలాంగులు ఉపేంద్ర (59), జి.మాణిక్యం(44)లకు జారీ చేసిన ఆసరా కార్డుైలపై ‘వితంతువు’గా ముద్రించారు. ఇది చూసిన  స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ఒ క్కో కార్డును పరిశీలించి సంతకాలు పెట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు