'సుజనాపై సిట్ విచారణకు ఆదేశాలివ్వండి'

12 Apr, 2016 03:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.ఎస్.చౌదరి (సుజనాచౌదరి) కంపెనీలైన సుజనా గ్రూపు సంస్థల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (ఎస్‌ఐటీ) ఏర్పాటు చేసి విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినోద్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ఇది విచారణకు వచ్చింది.

పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది హరీన్ రావల్ విజ్ఞప్తిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘మీరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌ను గానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను గానీ ఎందుకు సంప్రదించరు? ముందుగా ఈ వ్యవహారాలపై సరైన ఫోరానికి ఫిర్యాదు చేయండి. ఏం జరుగుతోందో వారికి చెప్పండి. ఆ తర్వాత అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించండి..’ అని సూచించారు. ఈ మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు ధర్మాసనం అనుమతించింది.

మరిన్ని వార్తలు