బ్రేకింగ్‌: వీల్‌ఛైర్‌పైనే విక్రమ్‌గౌడ్‌ అరెస్టు

3 Aug, 2017 13:59 IST|Sakshi
విక్రమ్‌గౌడ్‌ అరెస్టు.. వీల్‌ఛైర్‌పై కోర్టుకు!

హైదరాబాద్‌: సంచలనం రేపిన కాల్పుల డ్రామా కేసులో మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ తనయుడు, కాంగ్రెస్‌ నేత విక్రమ్‌ గౌడ్‌ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంటూ అపోలో ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. ఆ వెంటనే పోలీసులు విక్రమ్‌ గౌడ్‌ను అదుపులోకి తీసుకొని.. వీల్‌ఛైర్‌ మీదనే ఆయనను కోర్టుకు తరలించారు.

జనాల్లో సానుభూతి కూడగట్టుకునేందుకు విక్రమ్‌ గౌడ్‌ ఈ కాల్పుల డ్రామాకు తెరతీశారని పోలీసులు బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. విక్రమ్‌ గౌడ్‌పై జరిగిన కాల్పులు వెనుక ప్రధాన సూత్రధారి కూడా ఆయనేనని, పథక రచన, కాల్పులకు కాంట్రాక్ట్‌ ఇవ్వడం, ఆయుధాన్ని దాచి పెట్టడం, నిందితులకు షెల్టర్‌ ఇవ్వడం.. ఇలా ప్రతి అంశాన్నీ విక్రమ్‌ స్వయంగా పర్యవేక్షించాడని నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇలా తనపై తాను కాల్పులు జరిపించుకోవడం వెనుక ప్రధాన కారణాలను పోలీసులు గుర్తించారు. కాల్పుల పథక రచన వెనుక విక్రమ్‌ గౌడ్‌కు ఈ కింది ఉద్దేశాలు ఉన్నట్టు వెల్లడించారు..

♦ సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న నేపథ్యంలో పార్టీ టికెట్, తన నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి పొందడం..
♦  తన శత్రువులపై పోలీసుల దృష్టి పడేలా చేయడం, అప్పులవాళ్లు తన జోలికి రాకుండా చేయడం..
♦ ఒడిశాలో మైనింగ్‌ రంగానికి సంబంధించి సాంబశివరావు దగ్గర తాను పెట్టుబడిగా పెట్టిన సొమ్ము తిరిగి తెప్పించుకోవడం..
♦  కొంతకాలంగా దూరంగా ఉంటున్న కుటుంబంతో పాటు స్నేహితుల నుంచీ సానుభూతి పొందటం..
♦ గతంలో రద్దయిన ఆయుధ లైసెన్స్‌ తిరిగి పొందటంతో పాటుపోలీసులే గన్‌మన్లను ఏర్పాటు చేసేలా చేయడం..