సంచలన విషయాలు వెల్లడించిన షిపాలి

29 Jul, 2017 18:36 IST|Sakshi
సంచలన విషయాలు వెల్లడించిన షిపాలి

హైదరాబాద్‌: మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కొడుకు విక్రమ్‌ గౌడ్‌పై కాల్పుల విషయంలో ఇంకా మిస్టరీ వీడటం లేదు. గంటగంటకు ఈ కేసులో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ ఘటనలో తాజాగా విక్రమ్‌ భార్య షిపాలి పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఇదరు ఆగంతకులు తమ ఇంటికి వచ్చి.. విక్రమ్‌పై కాల్పులు జరిపి పారిపోయారని ఆమె చెప్పారు. 'అర్ధరాత్రి తర్వాత ఇద్దరు ఆగంతకులు బైక్‌పై మా ఇంటికి వచ్చారు. అందులో ఒకరు హెల్మెట్‌ ధరించారు. మరొకరు మాస్క్‌ ధరించారు' అని ఆమె తెలిపారు. అయితే, షిపాలీ చెప్పిన విషయాలకు, విక్రమ్‌గౌడ్‌ చెప్పిన వివరాలకు మధ్య ఎక్కడ పొంతన లేకపోవడంలో పోలీసులను అయోమయానికి గురిచేస్తోంది.

ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి తనపై కాల్పులు జరిపారని, అనంతరం కారులో పారిపోయారని విక్రమ్‌ చెప్పారు. అయితే, అందుకు విరుద్ధంగా ఇద్దరు వ్యక్తులు ఒకరు హెల్మెట్‌ ధరించి.. మరొకరు ముసుగు ధరించి బైక్‌పై వచ్చారని షిపాలి చెప్పడంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి. దాదాపు పది పోలీసు ప్రత్యేక బృందాలు ఈ కేసు దర్యాప్తును ముమ్మరంగా చేపడుతున్నా.. కాల్పులు ఎవరు జరిపారనేది అంతుచిక్కడం లేదు. విక్రమ్‌ గౌడ్‌ నివాసం సమీపంలో ఉన్న పలు సీసీ టీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించినా.. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు రావడం గానీ, ఒకరు ముసుగు ధరించి రావడంగానీ పోలీసులకు కనిపించలేదని తెలుస్తోంది. దీంతో పోలీసులకు కూడా ఈ కేసులో అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

మరిన్ని వార్తలు