పోలీసులకు నయీంతో లింకులు.. ఇవీ ఆధారాలు!

2 Feb, 2017 09:31 IST|Sakshi
పోలీసులకు నయీంతో లింకులు.. ఇవీ ఆధారాలు!
గ్యాంగ్‌స్టర్ నయీం వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన అధికారులు ఎవరికీ అతడితో సంబంధాలు లేవని ఎంత గట్టిగా చెప్పినా.. ప్రతిసారీ ఏదో ఒక ఆధారం బయటపడుతూనే ఉంది. తాజాగా మరోసారి కొంతమంది పోలీసు అధికారులు నయీంతో అంటకాగినట్లు రుజువులు లభించాయి. సీడీఐ డీఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు నయీంతో చర్చలు జరుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. వాళ్లిద్దరూ కలిసి ఓ రెస్టారెంటులో భోజనం చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో బయటకు వచ్చింది. ఆయన గతంలో కీలకమైన విభాగాల్లో ఎస్ఐ స్థాయి నుంచి పనిచేశారు. నయీంతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని అంటున్నారు. 
 
ఎన్‌కౌంటర్ జరగడానికి కొంత కాలం ముందు నయీం హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తూ, పోలీసుల సమాచారాన్ని నయీంకు అందజేస్తూ అతడికి రక్షణగా ఉండేవారని ఆరోపణలున్నాయి. నయీంకు సంబంధించిన వ్యక్తుల వివరాలను కూడా పోలీసుశాఖలో తన పలుకుబడి ద్వారా సేకరిస్తూ వాటిని నయీంకు చేరవేసేవారంటున్నారు. మద్దిపాటి శ్రీనివాసరావుపై గతంలో అనేక సందర్భాల్లో ఆరోపణలొచ్చినా, సరైన సాక్ష్యాధారాలు దొరకలేదు. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో ఆధారాలు బయటకు రావడంతో ఇక ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం సీఐడీలోనే ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మరో వ్యక్తి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. ఆయన గతంలో నల్లగొండ జిల్లాలో పనిచేశారు. ఇంత స్పష్టమైన ఆధారాలు బయటకు రావడంతో మరోసారి నయీం తేనెతుట్టె కదిలినట్లయింది.