ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తే చర్యలు

12 Dec, 2016 15:03 IST|Sakshi

సైదాబాద్: ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా వాహనాలను పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరహరి అన్నారు. సైదాబాద్ మండల పరిధిలోని సుబ్రహ్మణ్యనగర్‌లో శనివారం సైదాబాద్ ఇన్‌స్పెక్టర్ సత్తయ్యతో కలిసి ఆయన వాహనాలను తనిఖీ చేశారు. సుబ్రహ్మణ్య నగర్లో ఎక్కడ పడితే అక్కడ ఆటోలను నిలుపుతున్నారని స్థానికులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లకు పార్కింగ్‌పై అవగాహన కల్పించారు. సుబ్రహ్మణ్యనగర్ పార్కు వద్ద వాహనాలను నిలుపుకోవాలని కానీ కాలనీలో ఇళ్ల ముందు ఆటోలను పార్క్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు ఆటో డ్రైవర్లు ఎక్కువ కిరాయి తీసుకున్నా తమకు ఫిర్యాదు చేయాలని ఆయన ఫోన్‌నెంబర్లను అక్కడి గోడలపై రాశారు. ప్రతి వాహనదారుడు రోడ్డు, రవాణ చట్టాలపై అవగాహన కల్గి ఉండాలని సూచించారు. పోలీసు సేవలకు సంబంధించి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇన్‌స్పెక్టర్ సత్తయ్య తెలిపారు. దాని ద్వారా ఫిర్యాదుతో పాటు అత్యవసర సమయాల్లో కూడా వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు సత్యనారాయణరాజు, ప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు