హైదరాబాద్: టీవీలో ప్రసారమైన షోను అనుకరిస్తూ ఓ బాలుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అనంతరం కాలిన గాయాలతో చనిపోయాడు. ఈ ఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. జయదీప్ అనే బాలుడు ఓ చానల్ లో ప్రసారమైన షో చూస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని చనిపోయాడు. జయదీప్ మృతికి కార్టూన్ షో నిర్మాతలు బాధ్యత వహించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
రియాల్టీ షోలతో పాటు కొన్ని టీవీ షోలను బాధ్యతారాహిత్యంగా చిత్రీకరించడంతో హైదరాబాద్ నగరంలోనే ఇప్పటి వరకు ముగ్గురు చిన్నారులు చనిపోయిన ఘటనలు వెలుగు చూశాయని చెప్పారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బాలల హక్కుల సంఘం జాతీయ బాలల హక్కుల కమిషన్లో పిటీషన్ దాఖలు చేస్తూ బాధ్యతరహితమైన టీవీ షోలు, రియాల్టీ షోలను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. సదరు చానల్ నిర్మాతలపై కేసులు నమోదు చేయాలన్నారు.