హైదరాబాద్: సైఫాబాద్ ఠాణా పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో నగర పోలీసులు ఆంక్షలు విధించారు. లిఖితపూర్వకమైన అనుమతి లేకుండా ఎటువంటి ఆందోళనలు, ర్యాలీలు చేపట్టవద్దని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఈ ఆంక్షలు ఈ నెల 17 ఉదయం ఆరు గంటల నుంచి నవంబర్ 11వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ రెండు నెలల పాటు బహిరంగ సమావేశాలు, ఐదుగురు మించి వ్యక్తులు గుమికూడవద్దని, ఆయుధాల, బ్యానర్లు, ప్లకార్డులు తదితర వస్తువులు వెంట పెట్టుకోవద్దని కోరారు. ఇవి ఎవరైనా ఉల్లంఘిస్తే ఐపీసీ 88 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటామని మహేందర్ రెడ్డి హెచ్చరించారు.