మద్యపాన నిషేధం అమలును ప్రశ్నించరేం...?

14 Apr, 2016 01:54 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 గురించి పదే పదే మాట్లాడే హిందుత్వ వాదులు అదే రాజ్యాంగం లోని ఆర్టికల్ 47 ప్రకారం మద్యపాన నిషేధం అమలు కోసం ఎందుకు నోరువిప్పరని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్  ఒవైసీ ప్రశ్నించారు. మంగళవారం అర్థరాత్రి తాడ్‌బన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ  నిజంగా దమ్ముంటే ఆర్టికల్ 47 లోని అంశాల అమలుకు ప్రయత్నించాలన్నారు. మద్యపానం వల్ల వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, రహదారి ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు.  కేంద్రం లోని మోదీ సర్కార్ ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

వివిధ అంశాలపై రాజకీయం చేస్తూ మోదీ సర్కారు తన పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర తగ్గుతున్న ఇక్కడ పెట్రోల్ ధరలు మాత్రం దిగిరావడం లేదని ఆరోపించారు. కొందరు హిందుత్వ వాదులకు తన పేరు ఉచ్చరించనిదే నిద్ర పట్టడం లేదని,  కేవలం పార్టీల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు తన వాఖ్యలను వక్రీకరిస్తూ అవాకులు, చవాకులు పెల్చుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కలలుకంటున్న హిందూరాజ్యం ఎప్పటికీ సా ద్యం కాదని, హిందూస్థాన్‌గానే  ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

దేశంలో గట్టి ప్రతిపక్షం లేకుండా పోయిందని, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంలో  కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు.  రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హమీలను పూర్తి స్థాయిలో నెరవేర్చే విధంగా వత్తిడి తీసుకొస్తామని అసదుద్దీన్ ప్రకటించారు.  
 
దళితులతో కలిసి నడుద్దాం..
ముస్లిం-దళితుల ఐక్యత రాజ్యాధికారానికి సూచిక అని అసదుద్దీన్ అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాబోవు తరాలకు ఆదర్శంగా నిలుద్దామన్నారు. సభలో పార్టీ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషాఖాద్రి మోజం ఖాన్, జాఫర్ హుస్సేన్ తదితతరులు ప్రసంగించారు.
 
ఎన్‌ఐఏ రెండు నాల్కల ధోరణి
మాలే గాం  బ్లాస్ట్ కేసులో ఎన్‌ఐఏ యూ టర్న్ తీసుకోవడం పట్ల మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండి పడ్డారు. బుధవారం దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాలేగాం బ్లాస్ట్ కేసులో ఎన్‌ఐఏ  వ్యవహరిస్తున్న తీరు రెండు నాల్కల ధోరణిగా ఉందన్నారు. కేసులో అరెస్ట్ చేసిన ముస్లిం యువకులకు క్లిన్ చిట్ ఇచ్చి తిరిగి అనుమానాలు వ్యక్తం చేయడమేమిటని ప్రశ్నించారు. ఈ కేసులో హిందూ యువకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. ముస్లిం యువకులను టార్గెట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు