'కష్టపడే తత్వం ఉన్న నేతలు పార్టీని వదలరు'

4 Dec, 2015 09:07 IST|Sakshi
'కష్టపడే తత్వం ఉన్న నేతలు పార్టీని వదలరు'

హైదరాబాద్ : స్వతంత్రంగా ఎదగాలని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తమకు సూచించారని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కెపి వివేకానందా తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో  కెపి వివేకానందా మాట్లాడుతూ... ఎదిగే ప్రయత్నంలో ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

కష్టపడే తత్వం ఉన్న నేతలు టీడీపీని వదలరన్నారు. అధికార టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగి ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి, సాయన్న, తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీని వీడారని ఆరోపించారు. తాను కానీ మరో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కానీ టీడీపీని వీడటం లేదని తెలిపారు.

ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ ఉందని విమర్శించారు. తాను కూడా పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. పార్టీ కేడర్లో గందరగోళం సృష్టించేందుకే టీఆర్ఎస్ అలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రావాలని తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఇప్పటికే కోరామని వివేకానందా తెలిపారు.

మరిన్ని వార్తలు