ఇక 1వ తేదీ నుంచే రేషన్‌ సరుకులు

4 Jan, 2018 02:57 IST|Sakshi

 పౌరసరఫరాల శాఖ నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: ఇక నుంచి ప్రతి నెలా 1వ తేదీ నుంచే రేషన్‌ షాపుల ద్వారా లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సరుకుల రవాణా తేదీలు, క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ (సీబీ), రిలీజ్‌ ఆర్డర్‌ (ఆర్‌ఓ)లో మార్పులు చేసింది. ఈ–పాస్‌ అమలవుతున్న 25 జిల్లాల్లో ఈ విధానం తక్షణం ప్రారంభం అవుతుంది. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు రేషన్‌ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. 16వ తేదీన పౌరసరఫరాల శాఖ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లాలకు సరుకుల కేటాయింపులు చేపడతారు.

అలాగే 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రేషన్‌ డీలర్లు మీసేవ కేంద్రాల్లో డీడీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తేదీల్లో డీడీలు కట్టిన డీలర్ల రిలీజ్‌ ఆర్డర్లను స్థానిక ఏసీఎస్‌ఓలు సంబంధిత మండల స్థాయి నిల్వ కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. రిలీజ్‌ ఆర్డర్లు అందుకున్న వెంటనే గోదాం ఇన్‌చార్జులు సరుకుల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తారు. 

కొత్త విధానంపై శ్రద్ధ తీసుకోవాలి: కమిషనర్‌ సీవీ ఆనంద్‌ 
నూతన విధానంపై జిల్లా జాయింట్‌ కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. డీసీఎస్‌ఓ, ఏసీఎస్‌ఓ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, డిప్యూటీ తహసీల్దార్, పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు, స్టేజ్‌–1, స్టేజ్‌–2 కాంట్రాక్టర్లు, ఆయా గోదాముల ఇన్‌చార్జులతో ప్రతీ నెల జాయింట్‌ కలెక్టర్లు çసమావేశాలు నిర్వహించాలి.  

మరిన్ని వార్తలు