బంజారాహిల్స్ (హైదరాబాద్) : వైజాగ్లో ప్రముఖ సినీ హీరోలు సైతం పెట్టుబడులు పెట్టిన విల్లాలు... మీరు కూడా పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడిన నిందితురాలి కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్లోని సీతాఫల్మండీ ప్రాంతానికి చెందిన ఎస్.లలిత తన భర్త శ్రీవాస్తవతో కలిసి కొంత కాలంగా విల్లాలు, బంగారంపై పెట్టుబడి పెడితే భారీగా డబ్బులు ఇస్తామంటూ ఆశచూపి బంజారాహిల్స్ రోడ్ నెం.13లో పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసింది.
చాలామంది రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు లలితకు ఇచ్చారు. ఆ తర్వాత లలిత కనిపించకుండా పోయింది. దీంతో బాధితులు ఈ నెల 9వ తేదీన నగర పోలీసు కమీషనర్కు, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 420, 406 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.