సాక్షి, సిటీబ్యూరో: పరిశోధనా రంగాన్ని మరింత బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ మేరకు ప్రణాళికలు రూపొందిస్తోందని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్వీపీఇఐ)లో కొత్తగా ఏర్పాటు చేసిన “ది సృజన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్’ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో పరిశోధన శాల ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. దీనికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ప్రపంచంలోనే ఈ ఆస్పత్రి కార్నియా మార్పిడి శస్త్రచికిత్సల్లో ఐదో స్థానంలో ఉండటం మనకు గర్వ కారణమన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఐటీ హైదరాబాద్ చైర్మన్ డాక్టర్ జీవీఆర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ సృజన ఇన్నోవేషన్ సెంటర్ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. ఎల్వీప్రసాద్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్రావు మాట్లాడుతూ 2030 నాటికి అంధత్వం లేని తెలంగాణను తీర్చి దిద్దడమే లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో సృజన ఇ న్నోవేషన్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వీరేందర్ సాంగ్వాన్ పాల్గొన్నారు.