కవ్వాల్‌’ నుంచి 2 గ్రామాల తరలింపు!

18 Jan, 2018 03:42 IST|Sakshi

స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రాంపూర్, మైసంపేట్‌

రూ. 14 కోట్ల ప్యాకేజీ.. కుటుంబానికి రూ. 10 లక్షలు

సాక్షి, హైదరాబాద్‌: పులుల సంరక్షణ అభయారణ్యాల నుంచి గ్రామాల తరలింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులోని రెండు గ్రామాలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రెండు గ్రామాలకు కల్పించాల్సిన పునరావాసంపై సచివాలయంలో చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన పునరావాస అమలు రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం జరిగింది. నిర్మల్‌ జిల్లా రాంపూర్, మైసంపేటలకు చెందిన రూ. 14.20 కోట్ల విలువైన ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది.  

తొలుత రాంపూర్, మైసంపేట్‌..
మానవ సంచారంతో పులులు కావ్వాల్‌లో స్థిరంగా ఉండలేకపోతున్నాయని, అత్యవసరంగా ఆదివాసీ గ్రామాలను తరలించాలని అటవీ అధికారులు సీఎస్‌కు వివరించారు. కవ్వాల్‌ రిజర్వ్‌ కోర్‌ ఏరియాలో మొత్తం 23 గ్రామాలుండగా ప్రస్తుతం నిర్మల్‌ జిల్లా రాంపూర్, మైసంపేట్‌ గ్రామాల ప్రజలు పునరావాసం పొందేందుకు ముందుకు వచ్చిన ట్లు అధికారులు తెలిపారు. పులుల సంరక్షణ జాతీయ అథారిటీ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పించనున్నట్లు చెప్పా రు. ఆ ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం, లేదా అదే డబ్బుతో అటవీ శాఖ పునరావాసం కల్పించే ప్రతిపాదనను తీసుకొచ్చారు. పునరావాసానికి అయ్యే ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం భరిస్తాయని పులుల సంరక్షణ జాతీయ అథారిటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సోమశేఖర్‌ వివరించారు. పులుల అభయారణ్యం నుంచి తరలించే గ్రామాల వారికి  మెరుగైన పునరావాసం కల్పించాలని అటవీ శాఖను చీఫ్‌ సెక్రటరీ ఎస్పీ సింగ్‌ ఆదేశించారు.

మరిన్ని వార్తలు