తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ల వివరాలు

3 Apr, 2016 02:24 IST|Sakshi
తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ల వివరాలు

- సబ్‌రిజిస్ట్రార్ నుంచి నేరుగా భూముల క్రయ, విక్రయాల సమాచారం
 సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ రికార్డుల్లో భూమి హక్కులను బదిలీ (మ్యుటేషన్) ప్రక్రియను మరింత సరళతరం చేయనున్నారు. ఇకపై రాష్ట్రంలోని ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు జరిగినా... ఆ డాక్యుమెంట్ కాపీలతో సహా సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత మండల రెవెన్యూ కార్యాలయానికి చేరేలా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్, రెవె న్యూ శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో రికార్డుల్లో పేర్లు మార్చే మ్యుటేషన్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదనే అభిప్రాయముంది.
 
 భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రెవెన్యూ శాఖకు పంపుతున్నామని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతుండగా... రిజిస్ట్రేషన్ అధికారులిచ్చిన సమాచారం (అమ్మినవ్యక్తి పేరు, విస్తీర్ణం, భూమిస్థితి తదితర వివరాలు) రెవెన్యూశాఖ వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమాచారంతో సరిపోలకపోవడం వల్లనే  మ్యుటేషన్లు చేయలేకపోతున్నామని రెవెన్యూ అధికారులు అంటున్నారు.
 
 దీంతో భూముల రిజిస్ట్రేషన్లు పూర్తయినా మ్యుటేషన్లు జరగక సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. అసలు మ్యుటేషన్ల విషయంగా రెవెన్యూ యంత్రాంగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) రేమండ్‌పీటర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మ్యుటేషన్ కోసం 8 లక్షలకు పైగా దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నట్లు సీసీఎల్‌ఏ దృష్టికి వచ్చింది. ఆయన చొరవ ఫలితంగా పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్ దరఖాస్తుల సంఖ్య మూడు నెలల్లోనే 40 వేలకు తగ్గినట్లు తెలిసింది.
 
జూన్ 2 నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లపై ఆరా..
మ్యుటేషన్  పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడంతో పాటు దరఖాస్తు చేసుకోని రిజిస్ట్రేషన్లపై కూడా సీసీఎల్‌ఏ దృష్టి సారించారు. తెలంగాణ ఏర్పడిన (జూన్ 2, 2014) నాటి నుంచి ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను డాక్యుమెంట్లతో సహా తహసీల్దార్లకు అందజేయాలని ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులను సీసీఎల్‌ఏ కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూశాఖ వద్ద వెబ్‌ల్యాండ్‌లో స్పష్టమైన సమాచారం ఉన్నందున, సదరు సమాచారాన్ని తనిఖీ చేశాకే భూముల రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని... వెబ్‌ల్యాండ్‌లో లేని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లను తిరస్కరించాలని సూచించారు. సరైన సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారి వివరాలను వెబ్‌ల్యాండ్‌లోకి అప్‌లోడ్ చేయడంతో పాటు వెబ్‌ల్యాండ్‌లో అప్‌డేట్ అయిన సమాచారాన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వెనుక ముద్రించేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీని ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు వీలవుతుందని ఇరు శాఖల అధికారులు అభిప్రాయపడుతున్నారు.
 
 నెలాఖరులోగా  22ఏ నోటిఫికేషన్
హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా 22ఏ (నిషేధిత భూముల) నోటిఫికేషన్ జారీ చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నిర్ణయించారు. సెక్షన్ 22ఏ లో రెవెన్యూ శాఖ పొందుపరిచిన వివిధ ప్రభుత్వ శాఖల భూములను ఎక్కడా రిజిస్ట్రేషన్ చేయకుండా నియంత్రించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు సెక్షన్ 22ఏలో చేర్చేందుకు ఆయా ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న భూముల వివరాలను అందజేయాలని దేవాదాయశాఖ కమిషనర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, వక్ఫ్‌బోర్డ్ సీఈవోలకు సీసీఎల్‌ఏ లేఖలు రాశారు. విక్రయించేందుకుగానీ, రిజిస్ట్రేషన్ చేసేందుకుగానీ వీలులేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములు, సెక్షన్-43 కింద రిజిస్టరైన దేవాదాయశాఖ భూములు, సెక్షన్-37 ప్రకారం రిజిస్టరైన వక్ఫ్ భూములు, పట్టణ భూగరిష్ట పరిమితి (యూఎల్సీ) చట్టం ప్రకారం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్న భూములు, అవినీతి నిరోధక శాఖ అటాచ్ చేసిన భూములు, పన్నులు చెల్లించని ఆస్తుల వివరాలు, గ్రీన్‌పార్కుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చిన ఖాళీస్థలాల వివరాలు సెక్షన్ 22ఏలో  ఉంటాయి.

>
మరిన్ని వార్తలు