రైల్వేస్టేషన్‌లో యువతి అపహరణకు యత్నం

27 Feb, 2014 10:30 IST|Sakshi
రైల్వేస్టేషన్‌లో యువతి అపహరణకు యత్నం

  సికింద్రాబాద్ : మాయమాటలు చెప్పి యువతి (16)ని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. రైల్వే ఇన్‌స్పెక్టర్ అంబటి ఆంజనేయులు కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన యువతి కొద్దిరోజుల క్రితం బోయిన్‌పల్లిలో ఉండే తమ బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం తిరిగి విజయవాడ వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి..  8వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు కోసం ఎదురు చూస్తోంది.  ఇంతలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమెను తనతో తీసుకెళ్లేందుకు యత్నించాడు.

అతని కుతంత్రం గ్రహించిన ఆ యువతి తాను రానని చెప్పింది.  దీంతో అతను చేతులు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించగా.. కేకలు వేసింది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడు మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి  పి.పరంజ్యోతి(62) అని తేలింది.  రైల్వేపోలీసులు అతడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

>
మరిన్ని వార్తలు