60 ఏళ్లుగా నిర్ధారించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో పనిచేస్తున్న టీచర్లు, ఆయాల పదవీ విరమణపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 60 ఏళ్లు దాటిన వారు రిటైర్మెంట్ కావాలని పేర్కొంది. పదవీ విరమణ చేసిన వారికి ఆర్థిక సాయాన్ని సైతం ప్రకటించింది. పదవీ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లకు రూ.60 వేలు, అంగన్వాడీ సహాయకులు, మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.30 వేల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్మెంట్ అయిన ఈ మేరకు లబ్ధి చేకూర్చాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు ఆదేశాలిచ్చారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లు నిండినప్పటికీ విధుల్లో కొనసాగుతున్న టీచర్లు, సహాయకులు 5,400 మంది ఉన్నారు. ఇందులో అంగన్వాడీ టీచర్లు 616, అంగన్వాడీ సహాయకులు 4724, మినీ అంగన్వాడీ కేంద్రాల్లోని టీచర్లు 58 మంది ఉన్నారు. తాజాగా పదవీ విరమణపై స్పష్టత ఇవ్వడంతో వారంతా విధులకు సెలవు ప్రకటించవచ్చు. వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అందనుంది.