పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ

13 Feb, 2014 05:11 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఐదు రోజులుగా కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె నుంచి నగర ప్రజలకు ఉపశమనం లభించింది. బుధవారం సాయంత్రం మునిసిపల్ మంత్రి ఆయా కార్మిక సంఘాలతో జరిపిన చర్చలతో నేతలు తాత్కాలికంగా సమ్మె ఉపసంహరణకు అంగీకరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు.. పొంచివున్న అంటువ్యాధులు.. తదితర కారణాల దృష్ట్యా ఒక మెట్టు దిగినట్లు యూనియన్ల నేతలు వెల్లడించారు. బుధవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు పారిశుధ్య కార్యక్రమాల్లో నిమగ్నమవుతారని పేర్కొన్నారు.

సచివాలయంలో మంత్రి మహీధర్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ మేయర్ మాజిద్‌హుస్సేన్,  కమిషనర్ సోమేశ్‌కుమార్, మునిసిపల్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో కార్మిక సం ఘాల నేతలతో చర్చలు జరిపారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కార్మిక సంఘాలు కోరినంత మేర వేతనాలు పెంచలేకపోతున్నామని మంత్రి చె ప్పారు. ప్రస్తుతానికి జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాల్ని నెలకు రూ. 6700 నుంచి రూ. 8500లకు పెంచేం దుకు అంగీకరించారు. త ద్వారా సంవత్సరానికి రూ. 53.64 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ప్రస్తుతం జీహెచ్ ఎంసీ కార్మికులకు 27 శాతం ఐఆర్ ఇచ్చారు.
 
జీహెచ్‌ఎంసీ ముట్టడి..
 
అంతకుముందు మధ్యాహ్నం వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సంఘాల నేతలు మాట్లాడుతూ.. కార్మికుల వేతనాలు పెంచకపోవడమే కాక, ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించ డం దారుణమని దుయ్యబట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ శాసనసభా పక్ష నాయకుడు గుండా మల్లేశ్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ నాయకుడు జె.చలపతిరావు, సీఐటీయూ నాయకుడు పాలడుగు భాస్కర్, బీఎం ఎస్ నాయకుడు శంకర్,ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, తదితర సంఘాలకు చెందిన నాయకులు ప్రసంగించారు. అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు.
 

మరిన్ని వార్తలు