ఛీ..

11 Jul, 2015 00:11 IST|Sakshi
ఛీ..

నగరం... నరకం
ఎక్కడ చూసినా చెత్త కుప్పలే
నేటి నుంచి వీధి దీపాలు, నీటి సరఫరా కూడా బంద్

 
సిటీబ్యూరో: పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఐదు రోజులుగా జీహెచ్‌ఎంసీలో పరిస్థితులు దుర్భరంగా మారాయి. వీధులు, రహ దారులనే తేడా  లేకుండా అన్నిచోట్లా పెద్ద ఎత్తున  చెత్త కుప్పలు పేరుకుపోయాయి. అంటు వ్యాధులు ప్రబలుతుండటంతో జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయ చర్యలకు దిగింది. ప్రైవే టు వాహనాలు.. తాత్కాలిక (ప్రైవేటు) కార్మికులు... స్వచ్ఛ యూనిట్ల సహకారంతో పనులు చేపట్టింది. సమస్యల పరిష్కారం కోసం తాము విధులు బహిష్కరిస్తుంటే... మీరెలా పనులు చేస్తారంటూ పారిశుద్ధ్య కార్మికులు వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక కార్మికులను అడ్డుకున్నారు. వారిపై దాడులకు తెగబడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉభయవర్గాల వారు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నారు. మరో ఘటనలో ఒక మహిళ మెడలోని పుస్తెలతాడును లాక్కువెళ్లారు. మొత్తానికి మున్సిపల్ కార్మికుల సమ్మె ఓవైపు నగరాన్ని దుర్గంధభరితం చేయగా... మరోవైపు కార్మికుల మధ్య ముష్టియుద్ధాలకు తెరతీసింది. టోలీచౌకీ సాలార్జంగ్ కాలనీ, మాసబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల్లో  తాత్కాలిక కార్మికులతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తుండగా... మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా అధికారులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం పోలీసుల వరకు వెళ్లింది. తార్నాకలో ‘సేవ్ హైదరాబాద్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పనులు జరుగుతుండగా జీహెచ్‌ఎంసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. జీహెచ్‌ఎంసీ కార్మికులు తార్నాక చౌరస్తాలో అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. కుత్బుల్లాపూర్‌లో మున్సిపల్ ఉద్యోగి జీతమ్మ విధులు నిర్వహిస్తుండగా.. ముగ్గురు ఔట్‌సోర్సింగ్ కార్మికులు దాడి చేశారు. ఆమె మెడలోని పుస్తెలతాడును ఎవరో తెంపుకొని వెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులకు   ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ వద్ద చెత్త తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకొని డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. దీంతో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెత్తను తెచ్చి నడిరోడ్డుపై పోసి తమ నిరసన వ్యక్తం చేశారు.

 కుత్బుల్లాపూర్‌లోని వివిధ కాలనీల్లో ఉన్న చెత్తాచెదారం తీసుకు వచ్చి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద డంప్ చేసి నిరసన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. వివిధ యూనియన్ల నేతృత్వంతో శనివారం ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ లోని గుర్తింపు యూనియన్ జీహెచ్‌ఎంఈయూ మాత్రం సమ్మె విరమించినట్లు ప్రకటించింది. ఈ నెలాఖరులోగా కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు హోంమంత్రి తెలిపినందున సమ్మె విరమిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షుడు యు.గోపాల్ స్పష్టం చేశారు. హెల్త్‌కార్డులపై కూడా హామీ లభించిందని చెప్పారు. తమ యూనియన్ కార్మికులంతా విధుల్లో చేరుతున్నట్లు వెల్లడించారు.

 పొంగుతున్న మ్యాన్‌హోళ్లు..
 రోడ్లపై పేరుకుపోతున్న చెత్తకుప్పలతో పాటు వివిధ ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. రహదారులు మురుగునీటితో నిండి...రాకపోకలకు ఇబ్బం దులు తలెత్తుతున్నాయి.  
 
నేటి నుంచి వీధి దీపాలు, నీరు బంద్

 తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిం చడం లేదని...ఈ నేపథ్యంలో శనివారం నుంచి వీధి దీపాలు, నీటి సరఫరా బంద్ చేస్తామని సమ్మెలో పాల్గొంటున్న యూనియన్లు ప్రకటించాయి.

పనుల తీరిదీ..
 జీహెచ్‌ఎంసీలో నిత్యం పనిచేసే వాహనాలు.. కార్మికు లు.. తరలించే చెత్త.. శుక్రవారం పనిచేసిన వాహనాలు, కార్మికులు, తరలించిన చెత్త వివరాలిలా ఉన్నాయి.

మరిన్ని వార్తలు