సర్పంచుల ధనదాహం వల్లే..

25 Jan, 2017 03:22 IST|Sakshi
సర్పంచుల ధనదాహం వల్లే..

సాక్షి, హైదరాబాద్‌: కొందరు సర్పంచ్‌లు, అధికారుల ధనదాహం వల్లే హైదరాబాద్‌ చుట్టు పక్కల అక్రమ నిర్మాణాలు వెలిశాయని హెచ్‌ఎండీఏ హైకోర్టుకు తెలిపింది. అక్రమంగా ఆర్జించిన మొత్తాలతో ఓ సర్పంచ్‌  తన కుమారుడితో సినిమానే నిర్మించారని హెచ్‌ఎండీఏ తరఫు న్యాయవాది వి.నర్సింహగౌడ్‌ వివరించారు. జీ+2 వరకు పంచాయతీలు అనుమతి ఇవ్వొచ్చునని, అందుకు వారే ఫీజులన్నీ వసూలు చేసుకుంటారని తెలిపారు. జీ+2 కంటే ఎక్కువ అంతస్తుల్లో నిర్మించే భవనాలకు తాము అనుమతులిచ్చి, ఆ ఫీజులు వసూలు చేసుకుంటామన్నారు.

పంచాయతీల పరిధిలో లేఔట్లలో భవన అనుమతులు ఇస్తున్న హెచ్‌ఎండీఏ తద్వారా వచ్చే నిధుల్లో పంచాయతీలకు వాటా ఇవ్వడం లేదంటూ కొంపల్లి గ్రామ సర్పంచ్‌ జమ్మి నాగమణి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృ త్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. వాదనలు విన్న తర్వాత ఈ వివాదానికి ఓ పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు