వంద కోట్లకుపైగా నొక్కేశారు!

16 Feb, 2017 03:43 IST|Sakshi
వంద కోట్లకుపైగా నొక్కేశారు!

బోధన్‌ ట్యాక్స్‌ స్కాంలో వెలుగులోకి సంచలనాలు
ఉన్నతాధికారుల పాత్ర ఉందంటున్న సీఐడీ వర్గాలు
వారిని విచారించేందుకు అనుమతి కోరనున్న అధికారులు
త్వరలో అరెస్టులకు రంగం సిద్ధం


సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో జరిగిన కమర్షియల్‌ ట్యాక్స్‌ కుంభ కోణం వ్యవహారంలో రూ.100 కోట్లకుపైగా గల్లంతైనట్లు సీఐడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. తొలుత రూ.60 కోట్లు మాత్ర మే పక్కదారి పట్టాయని కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారుల విచారణలో బయటప డగా, సీఐడీ దర్యాప్తు ప్రారంభమైన రెండు రోజుల్లోనే భారీగా అవకతవకలను గుర్తించారు. రూ.100 కోట్లకుపైగా పన్నుల సొమ్మును అధికారులు, బ్రోకర్లు కలిసి నొక్కేశారని తేలింది. ఉన్నతా ధికారుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తం లో ట్యాక్స్‌ డబ్బులు గల్లంతయ్యాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు.

ఆడిటింగ్‌లో అడ్డదారి..
బోధన్‌ సర్కిల్‌ కార్యాలయంలో పనిచేసిన ఏసీటీవీ, నలుగురు సిబ్బంది బ్రోకర్లతో కలసి ట్రెజరీకి ట్యాక్స్‌ డబ్బులు చెల్లించినట్టు నకిలీ చలానాలు సృష్టించారు. ఇలా 2012 నుంచి 2015 వరకు దందా సాగించారని సీఐడీ దర్యాప్తులో బయటపడింది. అంతేకాదు ఏటా జరిగే ఆడిటింగ్‌ రిపోర్టులోనూ తప్పుడు లెక్కలు చూపించినట్టు తేలింది. సర్కిల్‌ కార్యా లయాల్లో జరిగిన ఆడిట్‌ రిపోర్టును కమ ర్షియల్‌ ట్యాక్స్‌ ఉన్నతాధికారులు సరిగా పరిశీ లించకపోవడం, కొందరు ట్రెజరీ ఉద్యోగులు మామూళ్లు పుచ్చుకుని నకిలీ చలానాలపై దృష్టి సారించలేదని గుర్తించినట్లు తెలిసింది.

ఫైలు బూడిద చేశారు
బోధన్‌ సర్కిల్‌లో పనిచేసిన కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు నకిలీ చలానాలతోపాటు మిల్లర్లు ట్యాక్స్‌ కట్టినట్టు పక్కాగా రికార్డులు సృష్టించారు. కానీ అలా సృష్టించిన ఖాతా బుక్కులు, డాక్యుమెంట్లను తర్వాత కాల్చేసినట్టు సీఐడీ అనుమానిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా గతంలో కమర్షియల్‌ ట్యాక్స్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగినట్టుగా బోధన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. తాజాగా కేసులో విచారణలో భాగంగా సీఐడీ అధికారులు ఆ ఘటనపైనా విచారణ జరపబోతున్నారు.

ఉన్నతాధికారులను విచారిస్తాం..!
బోధన్‌ స్కాం వ్యవహారంలో కమర్షియల్‌ ట్యాక్స్‌ ఉన్నతాధికారులను ప్రశ్నిం చేందుకు అనుమతించాలని సీఐడీ అధికా రులు ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడిన ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు కూడా కీలకపాత్ర వహించారని, వారి అండదండలు లేనిదే కింది స్థాయిలో వందల కోట్లు గల్లంతయ్యే అవకాశం లేదని వారు పేర్కొంటున్నారు. ఇక ఈ కేసులో ఉన్న ఏసీటీవోతో పాటు మరో నలుగురు సిబ్బందిని అరెస్ట్‌ చేసేందుకు సీఐడీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు