గ్రామాల్లో చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్లు

3 Apr, 2018 02:23 IST|Sakshi

మంత్రి జూపల్లి కృష్ణారావు

సాక్షి, హైదరాబాద్‌: గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని సెర్ప్‌ సీఈవో పౌసమిబసును ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ కేంద్రాన్ని, చెంగిచెర్లలోని జాతీయ మాంసం పరిశోధన సంస్థను మంత్రి సందర్శించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు.

దేశంలోనే ఏకైక మాంసం పరిశోధన కేంద్రం హైదరాబాద్‌లో ఉందని...దీని సహకారంతో స్థానికంగా మాంసం ప్రాసెసింగ్‌కు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సెర్ప్‌ అధికారులకు మంత్రి జూపల్లి సూచించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా గొర్రెలు ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన మాంసాన్ని అందించేందుకు  కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని వెన్నచర్లలో కబేళాను పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టింది.

>
మరిన్ని వార్తలు