స్మార్ట్‌గా తగ్గించుకోండి...

18 Oct, 2015 04:00 IST|Sakshi
స్మార్ట్‌గా తగ్గించుకోండి...

ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్‌కి ఎన్ని లైక్‌లు వచ్చాయో.? ట్విట్టర్‌లో ట్వీట్‌కి రెస్పాన్స్ ఏంటి.? వాట్సప్ గ్రూప్‌లో మెసేజ్‌లు మిస్ అవుతున్నానా? ఏదో ఆత్రుత.. ఇంకేదో ఆరాటం.. దానివల్ల వచ్చేది, పోయేది పెద్దగా ఉన్నా లేకపోయినా అలవాటైపోతున్న దినచర్య. సిటీలో స్మార్ట్ ఫోన్ యూజర్లలో పెరుగుతున్న యాంగ్జయిటీని తక్కువగా అంచనా వేయలేం.. వేయకూడదు కూడా. ఇది మన ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తోందని తెలియజేస్తోంది ఓ పరిశోధన. అంతేకాదు ఆ ఒత్తిడి తప్పులు చేసేందుకు కూడా కారణమవుతోందని హెచ్చరిస్తోంది.
 -ఓ మధు

 
ఆఫీస్ మీటింగ్‌లో.. ఫ్యామిలీతో ఉన్నా.. ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్ చేస్తున్నా.. డైనింగ్ టేబుల్ నుంచి టాయిలెట్ కమోడ్ దాకా... దేని మీద కూర్చున్నా ధ్యాస మాత్రం మొబైల్ మోత మీదే. స్మార్ట్ ఫోన్స్, యాప్స్ లైఫ్‌ని ఎంత ఈజీ చేస్తున్నాయో.. అంతే బిజీగా మార్చేస్తున్నాయి. యాప్ వేసుకోవడమే ఆలస్యం నోటిఫికేషన్స్ షురూ. ఏ పనిలో ఉన్నా నోటిఫికేషన్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట స్మార్ట్ ఫోన్ యూజర్లు. దీనిని ‘పింగ్’ అని అభివర్ణిస్తున్నారు పరిశోధకులు.

నోటిఫికేషన్ అటెండ్ చేసినా చేయకపోయినా ఈ పింగ్‌తోనే కాన్సన్‌ట్రేషన్ దెబ్బతింటోందని ఫ్లోరిడాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు నోటిఫికేషన్ రింగ్ వస్తేనే 3 రెట్లు ఎక్కువ తప్పులు చేసేస్తున్నారని ఈ పరిశోధనతో తేలింది. ఈ నేపథ్యంలో ఫోన్‌పై పెరుగుతున్న ఆత్రుత తగ్గించుకోవడానికి పరిశోధకుల సూచనలు మీకోసం...
 
* ప్రాధాన్యతల మేరకు నోటిఫికేషన్ అలర్ట్ పెట్టుకోవాలి.  
* వెంటనే సమాధానం తెలియజేయాల్సిన
 అవసరం లేని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫుడ్, ట్రావెల్ లాంటి యాప్స్‌ని మ్యూట్ చేసుకోవాలి.
* నోటిఫికేషన్ చెక్ చేసుకోవడానికి టైం ఫిక్స్ చేసుకోవాలి. ఆ సమయాన్ని విధిగా పాటించడం అలవాటు చేసుకోవాలి.
* మీరేంటో ప్రతీ నిమిషం ప్రపంచానికి తెలియజేయాల్సిన పని లేదు. విందూ, విహారాలకు వెళ్లినప్పుడు చక్కగా ఎంజాయ్ చేయండి. వచ్చిన తర్వాత మాత్రమే ఫ్రెండ్స్‌తో ఆ విశేషాలు పంచుకోండి.
* మన నీడకంటే ఎక్కువగా మనతో ఉండే ఫోన్‌కి అప్పుడప్పుడు బ్రేక్ ఇవ్వండి. ఈ బ్రేక్ ఫోన్ కన్నా మీకే ఎక్కువ అవసరం అని గుర్తించండి. వాకింగ్, గార్డెనింగ్ లాంటి పనుల్ని ఫోన్ లేకుండా చేసుకోండి.
* ఫ్యామిలీతో గడిపే సమయంలో కూడా ఫోన్‌ని సెలైంట్‌లో పెట్టండి. వీలైతే ఆ కాసేపు దాని జోలికి వెళ్లకపోతే మీ కుటుంబానికి మీరు ఎంతో క్వాలిటీ టైం స్పెండ్ చేసిన వారవుతారు.
 
ప్రాథామ్యాలు తెలుసుకోవాలి...

స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక ఫేస్‌బుక్, వాట్సప్‌కు చాలామంది అడిక్ట్ అవుతున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో అనర్థాలుంటాయి. లైక్స్ రాకపోతే ఫీలవడం, ఫ్రెండ్ గ్రూప్‌లో యాక్సెప్ట్ చేయకపోతే డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. వీటి విషయంలో రియలైజ్ కావాలి. మనకు ఏది ముఖ్యమో.. ఏది అప్రధానమో అర్థం చేసుకోవాలి. టీనేజర్లలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనపడుతోంది. వాళ్ల చదువు, ఇతరత్రా లక్ష్యాల మీద ఫోకస్ పెంచి ఈ తరహా కమ్యూనికేషన్‌ని తగ్గించుకోవాలి. లేదంటే కెరీర్ పాడవుతుందని గుర్తించాలి.  -డా.శేఖర్‌రెడ్డి, సైకియాట్రిస్ట్

మరిన్ని వార్తలు