తప్పులో కాలేసిన పవన్.. భగ్గుమన్న నెటిజన్లు

8 Sep, 2017 17:37 IST|Sakshi
తప్పులో కాలేసిన పవన్.. భగ్గుమన్న నెటిజన్లు

సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ ఉంటూ, అప్పుడప్పుడు ప్రజల వద్దకు వెళ్లి పలకరించే నేతగా పేరున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ పెద్ద తప్పులో కాలేశారు. బెంగళూరులో జరిగిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్(55) హత్య వివాదంపై పవన్ ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు. అయితే నెటిజన్లు మాత్రం పవన్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ పేరును గౌరీ శంకర్ గా పేర్కొనడమేంటని పవన్ ను ఎదురు ప్రశ్నిస్తున్నారు.

ఏదైనా విషయంపై ప్రశ్నించాలనుకుంటే ముందుగా అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని, పవన్ మాత్రం కనీసం పేరు సరిగా తెలుసుకోలేని పరిస్థితుల్లో ట్వీట్లు చేయడం అవసరమా అని నెటిజన్లు చురకలంటిస్తున్నారు. మంగళవారం రాత్రి హత్య జరగగా.. పలువురు ప్రముఖులు బుధవారం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించగా.. పవన్ మాత్రం తీరికగా గురువారం రోజు గౌరీ లంకేశ్ హత్యపై స్పందించడం కూడా నెటిజన్ల ఆగ్రహాన్ని రెట్టింపు చేసినట్లుంది.

చివరికి తాను చేసిన తప్పిదాన్ని దిద్దుకోవడంలోనూ ఆయన నైజం బయటపడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి క్షమాపణ చెప్పకుండానే.. గౌరీ శంకర్ పేరును గౌరీ లంకేశ్ గా చదువుకోవాలంటూ పవన్ మరో ట్వీట్ చేయడాన్ని సామాజిక కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు.

‘సామాజిక వేత్త, జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ తన కలంతో సమాజానికి ఎంతో సేవ చేశారు. కానీ తుపాకీ తుటాలకు ఆమె చనిపోయారు. అయితే దేశంలో ఎన్నో మతాలు, కులాలు, భాషలున్నాయని కలిసికట్టుగా ఉండాలే తప్ప ఇలాంటి దాడులకు పాల్పడకూడదు. ఒక్కో వ్యక్తికి ఓ తరహా వ్యక్తిత్వం ఉంటుంది. కానీ హిందూత్వ వాదులే ఆమె హత్యకు కారణమని వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేయకూడదు. ఒక్క గౌరీ లంకేశ్ ను హత్యచేస్తే.. లక్షల మంది గౌరీ లంకేశ్‌లు పుట్టుకొస్తారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ’ జనసేన అధినేత పవన్ వరుస ట్వీట్లు చేశారు. కానీ ఆలస్యంగా స్పందించడంతో పాటు గౌరీ లంకేశ్ పేరును తప్పుగా పేర్కొనడంతో పవన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

>
మరిన్ని వార్తలు