సాక్షి వెబ్‌సైట్‌ పాఠకులకు మనవి

20 Jul, 2017 21:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటూ, ఎప్పటికప్పుడు జాతీయ, అంతర్జాతీయ సహా పలు విభాగాల్లో తాజా సమాచారం అందించడంతోపాటు కదిలించే కథనాలతో ముందుకెళుతున్న 'సాక్షి వెబ్‌సైట్‌'ను అబాసుపాలు చేసేందుకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కుట్రలు చేస్తున్నారు. చేయకూడని తప్పులు సాక్షి వెబ్‌సైట్‌ చేసినట్లుగా, రాయని వార్తలు రాసినట్లుగా సాక్షి వెబ్‌ సైట్‌ హోంపేజీతో సహా మార్ఫింగ్‌ చేసి సాక్షి వెబ్‌ సైట్‌ పేరిట తప్పుడు కథనాలు వెలువరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ పాఠకులను తప్పుదోవపట్టిస్తున్నారు.



ఉదాహరణకు.. ఇటీవల 'వెంకయ్యనాయుడును ఉప-రాష్ట్రపతిగా ప్రతిపాదించింది నేనే: జగన్‌' అనే శీర్షికతో సాక్షి వెబ్‌సైట్‌లో కథనం వచ్చినట్లుగా సోషల్‌ మీడియాలో ఓ వార్త దుష్ప్రచారం జరిగింది. అయితే, ఇది గుర్తు తెలియని కొందరు వ్యక్తులు మార్ఫింగ్‌, ఎడిటింగ్‌ చేసి వెలువరించిన కథనమే తప్ప సాక్షి వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాము. సాక్షి వెబ్‌సైట్‌, అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలో తప్ప మరే ఇతర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వార్తలు కనిపించినా అవి ఫేక్‌ అని గుర్తించాలని, అలాంటి వార్తలకు సాక్షి వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాము. దయచేసి అలాంటి కథనాలను నమ్మవద్దని తెలుగు పాఠకులకు ముఖ్యంగా సాక్షి పాఠకులకు విజ్ఞప్తి చేస్తున్నాము.

మరిన్ని వార్తలు