రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి ఆగిన తల్లి గుండె
కాటేదాన్: కొడుకు మరణాన్ని కన్నపేగు తట్టుకోలేకపోయింది... నీవు లేకుండా ఈ లోకంలో ఉండలేనురా కన్నా.. అంటూ అతడితో పాటు వెళ్లిపోయింది... రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుమారుడిని చూసి గుండెపోటుతో తల్లి మృతి చెందింది. అందరి హృదయాలను కలిచి వేసిన ఈ విషాద ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని బృందావన్కాలనీలో మంగళవారం ఉదయం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం... బృందావన్కాలనీలో దిగంబర్రావు, మీరా దంపతులు నివసిస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు జ్ఞానేశ్వర్(30) స్థానికంగా వ్యాపారం చేస్తున్నాడు. ఇతను కొంతకాలంగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. మంగళవారం ఉదయం 10 గంటలకు జ్ఞానేశ్వర్ బైక్పై వెళ్తుండగా మూర్ఛ రావడంతో బైక్పై నుంచి కిందపడి గాయపడ్డాడు.
వాంతులు చేసుకుని అపస్మారకస్థితికి చేరుకున్నాడు. స్థానికులు అతడ్ని ఆటోలో సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద విషయం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చిన తల్లి మీరా విగతజీవిగా పడి ఉన్న కుమారుడ్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది.
జ్ఞానేశ్వర్కు భార్య, ఒక కుమారుడు ఉండగా.. వారం క్రితమే కూతురు పుట్టింది. ఆ సంతోషం విషయాన్ని సంబరంగా చేసుకోకముందే అదే ఇంట్లో ఇద్దరు ఒకే సారి మృతి చెందటం ఆకుటుంబాన్ని దుఖఃసాగరంలో ముంచేసింది. తల్లీకొడుకులు మీరా, జ్ఞానేశ్వర్ మృతి విషయం తెలిసి బృందావన్కాలనీ వాసులు కంటతడి పెట్టారు.