శ్రీనివాస్‌కు కన్నీటి వీడ్కోలు..

1 Mar, 2017 03:58 IST|Sakshi
శ్రీనివాస్‌కు కన్నీటి వీడ్కోలు..

అశ్రునయనాల మధ్య శ్రీనివాస్‌ కూచిభొట్ల అంత్యక్రియలు
రాయదుర్గం శ్మశానవాటికలో చితికి నిప్పంటించిన తండ్రి
ట్రంప్‌ వ్యతిరేక నినాదాలతో మారుమోగిన మహాప్రస్థానం
శ్రీనివాస్‌ నివాసానికి భారీగా తరలివచ్చిన బంధువులు, స్నేహితులు
అంత్యక్రియల్లో పాల్గొన్న దత్తాత్రేయ, చుక్కా రామయ్య తదితరులు


హైదరాబాద్‌: అమెరికాలో జాతి విద్వేష తూటాకు బలైన శ్రీనివాస్‌ కూచిభొట్ల అంత్యక్రియలు రాయదుర్గంలోని మహాప్రస్థానం శ్మశానవాటిక లో అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. మల్లం పేట గ్రామ పరిధిలోని ప్రణీత్‌ నేచర్స్‌ బౌంటీ లోని నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో శ్రీని వాస్‌ భౌతికకాయాన్ని ఊరేగింపుగా శ్మశానవాటి కకు తీసుకొచ్చారు. శ్రీనివాస్‌ తండ్రి మధు సూదన్‌రావు శాస్త్రోక్తంగా కర్మకాండలను నిర్వ హించారు. శ్రీనివాస్‌ చితికి నిప్పంటిస్తూ.. ఆయన కన్నీటిపర్యంతమైన తీరు అందరినీ కల చివేసింది. శ్రీనివాస్‌ అంత్యక్రియల్లో బంధువు లు, స్నేహితులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు శ్మశాన వాటికకు చేరుకున్న శ్రీనివాస్‌ భార్య సునయన, తల్లి వర్ధినిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, విద్యా వేత్త చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సినీనటులు రాజశేఖర్, జీవిత దంపతులు ఓదార్చారు. ఈ క్రమంలో తమ కుమారుడిని అన్యా యంగా చంపేశారని తల్లి రోదించడం అందరినీ కంట తడిపెట్టించింది.

ఇప్పటికైనా రక్షణ కల్పించాలి
సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో శ్రీనివాస్‌ భౌతికకాయం ఆయన స్వగృహానికి చేరుకోగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా బరువెక్కింది. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బోరున విలపిస్తున్న శ్రీనివాస్‌ తల్లి వర్ధిని, భార్య సునయనలను ఆపడం ఎవరితరం కాలేదు. ‘పిల్లలిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారని ఆనందంగా ఉన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఏదైనా ఇబ్బంది ఉంటే తిరిగి వచ్చేయాలని శ్రీనివాస్‌కి చెప్పేదానిని. అలాంటివేమీ లేవని శ్రీనివాస్‌ చెప్తూ ఉండేవాడు. ఇప్పటికైనా అమెరికాలో ఉండే భారతీయులకు రక్షణ కల్పించాలని కోరు తున్నా’ అంటూ వర్ధిని బోరుమన్నారు. మంగళ వారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10.30 వరకు శ్రీనివాస్‌ భౌతికకాయాన్ని ప్రజల సందర్శ నార్థం ఉంచారు. అనంతరం శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సభ్యు లు, బంధువులు, స్నేహితులు అశ్రునయనాల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు శ్రీనివాస్‌ పార్థివదేహాన్ని అంతిమయాత్ర రథంలో మహాప్రస్థానానికి తరలించారు.

భద్రతకు చర్యలు తీసుకుంటాం: దత్తాత్రేయ
అమెరికాలో భారతీయుల భద్రతకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటుందని దత్తాత్రేయ చెప్పారు. రాయదుర్గంలోని మహాప్రస్థానం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఈ విషయంలో జోక్యం చేసుకుని అమెరికాలోని భారత ఎంబసీ, ఇక్కడి అమెరికా ఎంబసీ అధికారులతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. అమెరికా ప్రభుత్వంతోనూ మాట్లాడి భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల్లో కొంత భయాందోళన ఉన్నా ప్రభుత్వ చర్యలతో వారిలో భరోసా పెరుగుతోందన్నారు. అమెరికా అభివృద్ధిలో భారతీయుల భాగస్వామ్యం ఎంతో ఉందని చుక్కా రామయ్య పేర్కొన్నారు. గ్లోబలైజేషన్‌లో విజ్ఞానవంతులకు ఎక్కడైనా ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. శ్రీనివాస్‌ లాంటి అమాయకులు ఇలా బలి కాకుండా కేంద్రం, అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకోవా లన్నారు. శ్రీనివాస్‌ హత్యను అందరూ ఖండిం చాలని, ఈ హత్య తర్వాత ప్రధాని మోదీ తగిన చర్యలు చేపట్టాలని అందరూ ఎదురు చూస్తున్నా రని జీవిత, రాజశేఖర్‌ చెప్పారు. భారతీయులు ఎక్కడున్నా వారి భద్రతకు ప్రభుత్వ భరోసా ఉండేలా చర్యలు ఉండాలన్నారు.

పలువురు ప్రముఖుల పరామర్శ..
మంగళవారం ఉదయం శ్రీనివాస్‌ నివాసానికి పలువురు ప్రముఖులు వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, సీపీఐ జాతీయ నేత నారాయణ, వైఎస్సార్‌సీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్‌గుప్తా, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, బీజేపీ సీనియర్‌ నేత మల్లారెడ్డి నివాళులర్పించారు.

ట్రంప్‌ డౌన్‌డౌన్‌ నినాదాలు
శ్రీనివాస్‌ అంత్యక్రియల్లో పాల్గొనేం దుకు వచ్చిన బంధువులు, స్నేహితులు, వివిధ పార్టీలకు చెంది న వారంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతి రేకంగా నినాదాలు చేయడంతో మహాప్రస్థానం శ్మశానవాటిక మారుమోగింది. ‘ట్రంప్‌.. డౌన్‌ డౌన్‌’.. ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కొందరు ట్రంప్‌కు వ్యతిరేకంగా, హత్యను ఖండిస్తూ ప్లకార్డులను పట్టుకుని అంత్యక్రియలకు హాజరయ్యారు.

నచ్చిన సూట్‌లోనే..
శ్రీనివాస్‌కు ఓ సూట్‌ అంటే చాలా ఇష్టం. శ్రీనివాస్‌ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు అమెరికా నుంచి అతనికి అత్యంత ఇష్టమైన సూట్‌లోనే తీసుకుచ్చారు. శ్రీనివాస్‌ సాయిబాబా భక్తుడు కావడంతో బాబా కండువాను పార్థివదేహంపై కప్పారు.