సరోగసీ దందాకు ఇక అడ్డుకట్ట

26 Jun, 2017 02:44 IST|Sakshi
కొత్త విధానం రూపకల్పనకు అధ్యయన కమిటీ
 
సాక్షి, హైదరాబాద్‌: సరోగసీ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర సరోగసీ బోర్డు(ఎస్‌ఎస్‌బీ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్త విధానంపై అధ్యయనం చేసేందుకు రాష్ట్రంలోని వైద్య నిపుణులు, తెలంగాణ డాక్టర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు, అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సారథ్యంలో ఈ కసరత్తు వేగం పుంజుకుంది. 6 నెలల క్రితం ఓ విదేశీయురాలు హైదరాబాద్‌లోని ఓ క్లినిక్‌లో సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది.

అనంతరం భర్తతో కలసి వారి దేశం తిరుగుపయనమయ్యే సమయంలో ఎంబసీ అధికారులు అభ్యంతరం తెలిపారు. పాపను తీసుకెళ్లాలంటే డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలని స్పష్టంచేశారు. తీరా ఆ పరీక్షల ఫలితాల్లో ఆ పాపకు, దంపతులకు జన్యు సంబంధం లేదని తేలింది. దీంతో అప్పుడే సరోగసీ ముసుగులో ప్రైవేటు క్లినిక్‌ల అక్రమాలు తెరపైకి వచ్చాయి. కానీ తనిఖీలు లేకపోవటంతో ఈ దందా క్రమంగా విస్తరించినట్లు ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  
మరిన్ని వార్తలు