ఎంబీసీలకు రాయితీ పెంపు

9 Mar, 2018 00:26 IST|Sakshi

యూనిట్‌కు రూ.లక్ష నుంచి రూ.12 లక్షల వరకు రుణ సాయం

ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) రుణసాయం, సబ్సిడీలను పెం చాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. స్వయం ఉపాధి పథకాలకు అందించే ఆర్థిక సహకారాన్ని మరింత పెంచాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే విధంగానే ఎంబీసీలకు సబ్సిడీలు ఇవ్వాలన్నారు. బీసీలకు అమలు చేసే ఎకనామిక్‌ సపోర్టు స్కీమ్‌కు ఇప్పటివరకు రూ.లక్షకు 60 శాతం (రూ.60 వేలు) సబ్సిడీ ఇచ్చేవారు.

అది సరిపోదని, మరింత పెంచాల్సిన అవసరముందని పేర్కొన్నారు. యూనిట్లకు అందించే రుణ సాయాన్ని రూ.లక్ష నుంచి రూ.12 లక్షల వరకు అందించాలన్నారు. రూ.లక్ష యూనిట్‌కు ఇకపై రూ.80 వేలు (80 శాతం), రూ.2 లక్షల యూనిట్‌కు రూ.1.40 లక్షలు (70 శాతం), రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల యూనిట్‌కు గరిష్టంగా రూ.5 లక్షలు (60 శాతం) సబ్సిడీ ఇవ్వాలని ఆదేశించారు.

ఈ మేరకు ఎంబీసీలకు అమలు చేసే స్వయం ఉపాధి పథకాల సబ్సిడీకి సంబంధించిన ఫైలుపై గురువారం కేసీఆర్‌ సంతకం చేశారు. గతేడాది ఎంబీసీ కార్పొరేషన్‌కు బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించామని, ఈసారీ నిధులు కేటాయిస్తామన్నారు. ఆ నిధులతో ఎంబీసీ కులాల్లోని పేద యువతకు స్వయం ఉపాధి పొందేందుకు కావాల్సిన ఆర్థిక సహకారం అందించాలని ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు