గోదావరి పరుగు

27 Oct, 2015 23:49 IST|Sakshi
గోదావరి పరుగు

{పయోగ పరీక్ష విజయవంతం
ముర్మూరు నుంచి బొమ్మకల్‌కు సరఫరా
30 ఎంజీడీల నీరు పంపింగ్
మరో రెండు నెలల్లో నగరానికి...

 
సిటీబ్యూరో:  గ్రేటర్ దాహార్తిని తీర్చే గోదావరి మంచినీటి పథకం మొదటి దశ ప్రయోగ పరీక్ష (ట్రయల్ రన్) విజయవంతమైంది. కరీంనగర్ జిల్లా ముర్మూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 58 కి.మీ. దూరంలో ఉన్న బొమ్మకల్‌కు మంగళవారం 30 ఎంజీడీల నీటిని పంపింగ్ చేశారు. ఈ నీటిని 3000 డయా వ్యాసార్థం గల భారీ పైప్‌లైన్ ద్వారా బొమ్మకల్‌కు తరలించారు. పైప్‌లైన్ల సామర్థ్యం, హైడ్రాలిక్ టెస్టులు, పైప్‌లైన్ల ఎయిర్‌వాల్వ్‌లు, జాయింట్లను పరిశీలించారు.

ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఎల్లంపల్లి బ్యారేజి నుంచి 1.5 కి.మీ. దూరంలో ఉన్న ముర్మూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు ఇప్పటికే నీటిని భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ) ద్వారా తరలించిన విషయం విదితమే. అక్కడి నుంచి బొమ్మకల్- మల్లారం - కొండపాక- ఘన్‌పూర్ మార్గంలో రూ.3800 కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయర్లతో పాటు సుమారు 186 కి.మీ మార్గంలో పైప్‌లైన్ల పనులు పూర్తయిన విషయం విదితమే. గోదావరి తొలిదశ ద్వారా గ్రేటర్‌కు 172 ఎంజీడీల జలాలను తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి 30 ఎంజీడీల నీటిని ఒకే మోటారు ద్వారా పంపింగ్ చేస్తున్నారు. మొత్తం పంపింగ్‌కు అవసరమైన 9 మోటార్లను ముర్మూరు పంప్ హౌస్ వద్ద సిద్ధంగా ఉంచారు.

మరిన్ని వార్తలు