అదే సీన్!

15 Dec, 2015 23:47 IST|Sakshi
అదే సీన్!

తేలని రిజర్వేషన్లు
నాయకులను వీడని ఉత్కంఠ తప్పని నిరీక్షణ
అంతటా అదే చర్చ

 
సిటీబ్యూరో:  అదే ఉత్కంఠ.. అదే ఆరాటం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఏ వార్డు ఏ వర్గానికి రిజర్వు చేశారనే విషయమై మంగళవారం రాత్రి వరకూ ఎటువంటి ప్రకటన రాలేదు. రాజకీయ పార్టీలకు నిరీక్షణ తప్పడం లేదు. వారిలో అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతోంది. తొలుత సోమవారమని.. ఆ తరువాత మంగళవారమని.. ఊహాగానాలు వెలువడడంతో... రెండు రోజులుగా కనిపించిన వారినల్లా ఈ విషయమై నాయకులు ఆరా తీస్తూనే ఉన్నారు. ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఉస్సూరుమంటున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ హైకోర్టుకు అందజేసిన అఫిడవిట్ మేరకు ఈనెల 12 నాటికి తాము ఏ వార్డులు ఎవరికి కేటాయించాలో సూచిస్తూ ప్రభుత్వానికి  ప్రతిపాదనలుపంపుతామని పేర్కొన్నారు.

వీటిని పరిశీలించి  ప్రభుత్వం డిసెంబర్ 15 నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల మేరకు ఎవరికి ఏ వార్డులో తెలియజేస్తూ నోటిఫికేషన్ వెలువరించగలదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందుగా సోమవారమే ఈ జీవో వెలువడగలదని పలువురు ఎదురు చూశారు. అయినా నిరాశే మిగిలింది. అఫిడవిట్ మేరకు మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనైనా వెల్లడవుతుందని భావించారు. కానీ నోటిఫికేషన్/జీవో వెలువడలేదు. దీంతో అంతా నిరాశకు గురయ్యారు.
 

>
మరిన్ని వార్తలు