హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం హైదరాబాద్లోని ఆర్బీఐ ఎదుట ఆందోళనకు దిగాయి. నోట్ల రద్దు తర్వాత 70 రోజులు గడిచినప్పటికీ సామాన్యుడి కష్టాలు తీరలేదని పేర్కొంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో నిరసన తెలిపారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో సామాన్యులు తీవ్ర ఇక్కట్లకు లోనవుతున్నారని ఈ సందర్భంగా ఉత్తమ్ అన్నారు.
ఈ విషయంలో ఆర్బీఐ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. చేతిలో డబ్బుల్లేక రైతులు రబీ పంటల సాగు 40 శాతం తగ్గించుకున్నారని చెప్పారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు ఆర్బీఐ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాలుపంచుకున్నారు.