'చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు'

23 Feb, 2016 13:56 IST|Sakshi
'చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు'

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ భవన్ లో మంగళవారం తలాసాని విలేకరులతో మాట్లాడారు. తాను టీఆర్ఎస్ లో చేరినప్పుడు చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని గుర్తు చేశారు. ఆయన స్థాయికి తగని భాష వాడారని అన్నారు. చంద్రబాబు మాటలు తమకు బాధ కలిగించాయని చెప్పారు. ఆయన చేస్తే నీతి, వేరే వాళ్లు చేస్తే అవినీతా అని ప్రశ్నించారు.

తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళుతున్నారో, లేదో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. ఏ ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు నిజస్వరూపం బయటపెట్టాలని అన్నారు. సింగపూర్, మలేసియా కట్టిస్తున్నానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సత్యహరిశ్చంద్రుడు మాదిరిగా మాటలు చెప్పే చంద్రబాబు దారి తప్పారా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు