సాక్షి, హైదరాబాద్: వినియోగదారులపై వేయనున్న విద్యుత్చార్జీల పెంపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. డిస్కంలు 7.5% నుంచి 10% వరకు చార్జీలు పెంచుతూ రాష్ర్ట విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు ప్రతిపాదనలు సమర్పించడాన్ని ఆ పార్టీ వ్యతిరేకించింది. తమ నిర్వహణలోని అవకతవకల వల్ల ప్రజలపై భారం వేయడంతో పాటు, రూ.6,800 కోట్లు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాబట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలపై నిరసనను వ్యక్తం చేసింది. ప్రజలపై భారం మోపకుండా ప్రభుత్వం భరించాలని ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్చేశారు. డిస్కం లు, ట్రాన్స్కో తమ అంతర్గత నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా టారిఫ్రేట్ల భారాన్ని వినియోగదారులపై పడకుండా చూడాలని డిమాండ్చేశారు.
ఆ ఒప్పంద లక్ష్యాలు నెరవేరుతాయా ?..
మహారాష్ట్రతో వివిధ ప్రాజెక్టులపై చేసుకున్న ఒప్పందం భగీరథ ప్రయత్నమంటూ చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ లక్ష్యాలు నెరవేరుతాయా లేదా అన్నది లోతుగా పరిశీలించాలని సీపీఎం సూచించింది. ఇప్పటికైనా రాష్ట్రానికి బచావత్ తీర్పు ప్రకారం రావాల్సిన నీటిని వినియోగించుకోడానికి, ప్రాజెక్టు వ్యయం తగ్గించేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.