సాక్షి, హైదరాబాద్: జీవో 123 రద్దుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్తే తాము కూడా ఇంప్లీడ్ అవుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. భూ సేకరణ జీవోను కొట్టివేసి హైకోర్టు వేసిన చెంపదెబ్బ నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. మంత్రి హరీశ్రావు అప్పీల్ ప్రకటనను పక్కనపెట్టి హైకోర్టు లేవనెత్తిన ఆయా అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా గురువారం ఎంబీభవన్లో చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్యలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరిస్తోందని, పేదలకు కాకుండా పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని హైకోర్టు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని ఆరోపించారు.