టార్గెట్‌..సేఫ్‌ సిటీ

29 Dec, 2016 01:21 IST|Sakshi
టార్గెట్‌..సేఫ్‌ సిటీ

ఎనిమిది శాతం మేర తగ్గిన నేరాలు
తీవ్రమైన వాటిపై ప్రత్యేక దృష్టి
ఆపరేషన్‌ స్మైల్‌లో దేశంలోనే అగ్రస్థానం
యూబ్‌ఖాన్‌పై చట్ట ప్రకారం చర్యలు
వార్షిక సమావేశంలో నగర కొత్వాల్‌ వెల్లడి

సిటీబ్యూరో: ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పీడీ) యాక్ట్‌ ప్రయోగం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పోలీసుల సమష్టి కృషి ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో 8 శాతం నేరాలు తగ్గాయని నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను సేఫ్‌ సిటీగా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం  మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్‌ మెస్‌లో 2016కు సంబంధించి వార్షిక నివేదిక విడుదల చేసేందుకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాల్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..

సేఫ్‌ సిటీ స్థాపన లక్ష్యంతో...
‘తెలంగాణ ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి ఆదేశాల మేరకు నగరంలో వ్యవస్థీకృత నేరాలకు తావు లేకుండా, దేశంలోనే ఉత్తమ సేఫ్‌ సిటీగా తీర్చిదిద్దడానికి సిటీ పోలీసు వింగ్‌ అహర్నిశలు పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జరిగిన బోనాలు, గణేష్‌ ఉత్సవాలు సహా అన్ని కీలక ఘట్టాలనూ చిన్న ఉదంతం కూడా లేకుండా పూర్తి చేయగలిగాం. ఒకప్పుడు నగరంలో మహిళలు ఆభరణాలు ధరించి బయటకు రావడానికి భయపడేవారు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకుని పని చేయడంతో స్నాచింగ్స్‌ కేసుల్లో 66 శాతం తగ్గుదల నమోదైంది. తీవ్రమైన నేరాలు 31 శాతం, ప్రాపర్టీ అఫెన్సులు 16 శాతం, వేధింపులు 18 శాతం, మహిళలపై జరిగే నేరాలు 12 శాతం తగ్గుదల నమోదుచేసుకున్నాయి. షీ–టీమ్స్‌ పని తీరు కారణంగా వేధింపుల కేసులు 1175 (2015) నుంచి 969కు (2016) వచ్చాయి.

నేరగాళ్ళకు శిక్షలు పడేలా చర్యలు...
కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు పెండెన్సీ తగ్గించడం, నేరగాళ్ళపై కేసులు రుజువు చేయడానికి అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ (యూఐ) కేసు మేళాలు చేపట్టాం. ఫలితంగా 50 శాతం పెండెన్సీ తగ్గింది. కరుడుగట్టిన, పదేపదే నేరాలు చేసే వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తున్నాం. మరోపక్క న్యాయవ్యవస్థతో సమన్వయం ఏర్పాటు చేసుకుని వారు జైల్లో ఉండగానే కేసు విచారణ పూర్తయ్యేలా ప్రయత్నిస్తున్నాం. ఫలితంగా నేరం నిరూపితమయ్యే కేసుల శాతం 36కు పెరగడంతో పాటు 23 మందికి జీవితఖైదు పడింది. సేఫ్‌ సిటీగా పిలిచే చెన్నైలో ప్రతి ఏడాది 2500 మంది నేరగాళ్ళపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తారు. దాన్ని ఆదర్శంగా తీసుకుంటూ సిటీలో ఈ ఏడాది 283 మందిపై ప్రయోగించాం. దీంతో ఇప్పటి వరకు మొత్తం 547 మందిపై ఇది ప్రయోగించినట్‌లైంది. ప్రజల కోసం, వారి భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది వీటి ఆధారంగా 244 కేసుల్లో ఆధారాలు లభించగా... 210 మందిని గుర్తించి అరెస్టు చేశాం.

బాలబాలికల కోసం ‘స్మైల్‌’...
ప్రమాదకరమైన పరిశ్రమల్లో పని చేస్తున్న, బాల్యాన్ని కార్ఖానాలకు అంకితం చేస్తున్న బాలబాలికల విముక్తి కోసం ఆపరేషన్‌ స్మైల్‌ చేపట్టి వారిని రెస్క్యూ చేస్తున్నాం. 800 మందికి పైగా బాలకార్మికులకు విముక్తి కల్పించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం. సుప్రీం కోర్టు గతంలో ఐటీ  యాక్ట్‌లోని సెక్షన్‌ 66 (ఎ)ను తొలగించింది. దీనిస్థానంలో రావాల్సిన మరో సెక్షన్‌ అమలులోకి రాలేదు. దీంతో ఈ సెక్షన్‌ కింద నమోదు చేసే కేసులు తగ్గడంతో సైబర్‌ క్రైమ్స్‌లో 24 శాతం తగ్గుదల నమోదైంది. ట్రాఫిక్‌ విషయంలో హైదరాబాద్‌ సిటీ దేశంలోనే ఉత్తమంగా ఉంది. అయినప్పటికీ సంతృప్తి పడకుండా ఇంకా మెరుగుదలకు కృషి చేస్తున్నాం. వివిధ రకాల క్రమశిక్షణా చర్యల కింద ఈ ఏడాది దాదాపు 25 మంది పోలీసుల్ని డిస్మిస్‌ చేశాం. పోలీసు ట్విన్‌ టవర్స్‌ పనులు ప్రారంభమయ్యాయి. 21 నెలల్లో నిర్మాణం పూర్తవుతుంది. ఈ లోపు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటాం.

పదేపదే ‘నిర్లక్ష్యాలపై’ చర్యలు...
నగరంలోని కొన్ని ఆస్పత్రులు, స్కూళ్ళల్లో అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. వీరి నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ప్రస్తుతం ఈ ఉదంతాలపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఓకే హాస్పటల్, స్కూల్‌లో పదేపదే ఉదంతాలు జరిగితే వాటి లైసెన్సులు రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించాం.’ అని కమిషనర్‌ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

అయూబ్‌ఖాన్‌ కేసులపై ప్రత్యేక దృష్టి...
సౌత్‌జోన్‌ పోలీసులు అరెస్టు చేసిన అయూబ్‌ఖాన్‌పై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తాం. అతడు సాక్షుల్ని బెదిరించే, ప్రభావితం చేసే ఆస్కారం లేకుండా జైల్లో ఉన్నప్పుడే కేసుల విచారణ పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తాం. ఇతడి బోగస్‌ పాస్‌పోర్ట్‌ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రాథమిక సమాచారం బట్టి శిక్షపడక ముందే దీన్ని పొందాడని తెలుస్తోంది. ఎలాంటి ఉల్లంఘనలు ఉన్నట్లు తేలినా బాధ్యులైన సిబ్బంది పైనా చర్యలు తీసుకుంటాం. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. నగరంలో సోషల్‌ మీడియా మానిటరింగ్‌ ద్వారా దీనికి ఆకర్షితులైన వారిని గుర్తించి కుటుంబీకులు, సంబంధీకులతో కలిపి డీ–రాడికలైజేషన్‌ కౌన్సిలింగ్‌ ఇస్తున్నాం. హద్దులు దాటిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాం. మరోపక్క మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరుగుతున్న ప్రమాదాలు నిరోధించే చర్యలు తీసుకుంటున్నాం. 2015లో 16,633 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు కాగా... 2940 మంది జైలుకు వెళ్ళారు. నవంబర్‌ 30 వరకు 16,602 కేసులు నమోదుకాగా.. జైలుకు వెళ్ళిన వారి సంఖ్య 7017గా ఉంది. ‘నిషా’చరుల నుంచి రూ.2,92,40,700 జరిమానా వసూలైంది.

మరిన్ని వార్తలు