3,250 కోట్ల నష్టం

19 Nov, 2016 01:59 IST|Sakshi
3,250 కోట్ల నష్టం

నోట్ల రద్దు పరిణామాలపై కేంద్రానికి నివేదించనున్న రాష్ట్ర ప్రభుత్వం
 
►  సామాన్య ప్రజలు ఎన్నో కష్ట నష్టాలు పడుతున్నారు
► త్వరగా రూ. 500 నోట్లను సరఫరా చేయాలి
► కనీస ఆదాయ పన్ను పరిమితిని పెంచాలి
► రైతుల నగదు డబ్బును వన్‌టైం ఎక్స్ఛేంజీ చేయాలి
► రూ. 2.5 లక్షల జమ నిబంధనను సడలించాలి
► నిర్మాణ రంగ కార్మికులకు ప్రత్యేక పథకం తేవాలి
► రాష్ట్రాల అప్పులపై మారటోరియం విధించాలని విజ్ఞప్తులు
► ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. నేటి సాయంత్రం ప్రధానితో భేటీ  

 
సాక్షి, హైదరాబాద్ :  పెద్ద నోట్ల రద్దు పరిణామాల కారణంగా రాష్ట్రానికి రూ.3,250 కోట్ల మేర నష్టం కలుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందులో వస్తు సేవలు, వాణిజ్య పన్నుల ఆదాయం రూ. 2,600 కోట్ల మేర తగ్గనుందని, రవాణా శాఖకు రూ. 450 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.200 కోట్ల వరకు కోత పడుతుందని నిర్ధారించింది. ఇక నోట్ల సమస్య కారణంగా సామాన్యులు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారని తేల్చింది. ఈ అంశాలన్నింటినీ విశ్లేషిస్తూ రూపొందించిన ప్రత్యేక నివేదికను.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రధాని మోదీకి అందించనున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రే ఢిల్లీకి వెళ్లారు.
 
నేటి సాయంత్రం భేటీ..
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చించేందుకు రావాలని సీఎం కేసీఆర్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసీఆర్ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. శనివారం సాయంత్రం అక్కడ మోదీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో చర్చించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్.. శుక్రవారం మధ్యాహ్నమే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా కసరత్తు చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించి.. సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రాష్ట్రాల ఆదాయంపై పడే ప్రభావాన్ని విశ్లేషించేలా నివేదికను తయారు చేయించారు. ఈ నివేదికను ప్రధానికి అందజేయనున్నారు.
 
అన్ని రంగాలపై దెబ్బ..
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కొత్త రాష్ట్రమైన తెలంగాణలో అన్ని రంగాలను దెబ్బతీసింది. రిజిస్ట్రేషన్, రవాణా  విభాగాల్లో ఆదాయం బాగా తగ్గింది. ఎకై ్సజ్, సేల్స్ టాక్స్, కమర్షియల్ ట్యాక్స్ విభాగాలపై ప్రభావం పడింది, నిర్మాణ రంగం కుదేలైంది. వివిధ పన్నుల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఈ ఏడాది దాదాపు రూ.3,250 కోట్లు తగ్గిపోతుందని అధికారులతో కసరత్తు సందర్భంగా సీఎం కేసీఆర్ అంచనా వేశారు. వచ్చే ఐదు నెలల్లో వస్తు సేవలు, వాణిజ్య పన్నుల ఆదాయంలో రూ.2,600 కోట్లు, రవాణా శాఖ ఆదాయంలో రూ.450 కోట్లు, ఎకై ్సజ్ ఆదాయంలో రూ.200 కోట్లు తగ్గుతుందని అంచనా వేశారు. మరోవైపు కేంద్రం రాష్ట్రానికి పంపిణీ చేసే పన్నుల ఆదాయానికి ఈ నెలలోనే రూ.450 కోట్లు కత్తెర వేసింది. దీంతో రాష్ట్ర ఆదాయానికి ఒక్కసారిగా గండి పడిందని కేసీఆర్ ఇటీవలే గవర్నర్ నరసింహన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.
 
అప్పుల చెల్లింపును వాయిదా వేయండి
ఆదాయం తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్రానికి చెల్లించాల్సిన అప్పులను కొంతకాలం వాయిదా వేయాలని ప్రధానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు రూ.150 కోట్లను కేంద్రం నుంచి తీసుకున్న అప్పుల కింద తిరిగి చెల్లిస్తోంది. దీనిని ఓ ఏడాది పాటు వాయిదా వేసినా దాదాపు రూ.1,800 కోట్లు కలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
 
సామాన్యుల ఇబ్బందులు తప్పించండి
కేంద్రం విధించిన నగదు మార్పిడి నిబంధనలు, విత్‌డ్రా ఆంక్షలతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను పరిశీలించిన సీఎం కేసీఆర్... సామాన్యులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగం ఇబ్బంది పడకుండా చూడాలని ప్రధానికి నివేదించనున్నారు. ఈ మేరకు పలు సూచనలు చేయనున్నారు.
 
నల్లధనాన్ని అరికట్టడానికి, దేశంలో ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి తీసుకున్న నిర్ణయం మంచిదే. అరుుతే ప్రజలు పడే అవస్థలు, ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవాలి. ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారులు, కార్మికులు, చిల్లర వర్తకులు నష్టపోకుండా చూడాలి.

-  రైతులు వ్యవసాయ పెట్టుబడులకు, ఉత్పత్తుల అమ్మకానికి నగదు లావాదేవీలే జరుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో వారికి రసీదులు కూడా ఉండవు. ఉన్నా దాచుకునే అలవాటుండదు. అందువల్ల రైతులు నష్టపోకుండా తమ డబ్బును బ్యాంకుల్లో జమ చేసుకునే వెసులుబాటు కల్పించాలి. ప్రత్యేక విధానం రూపొందించి మొత్తం ఒకేసారి నగదుగా తీసుకునే (వన్‌టైం ఎక్ఛేంజీ) అవకాశం కల్పించాలి.

- వ్యవసాయాదాయంపై పన్ను లేదని చెప్పినప్పటికీ ఈ అంశంపై రైతుల్లో స్పష్టత లేదు. రైతులందరూ బ్యాంకులో ఖాతాలు తెరిచి వ్యవసాయాదాయాన్ని జమ చేసుకోవచ్చని, ఆదాయ పన్ను శాఖకు రిటర్‌న్‌‌స దాఖలు చేసేటప్పుడు వ్యవసాయాదాయంగా ప్రకటించి పన్ను రాయితీ పొందాలని విసృ్తత ప్రచారం చేయాలి.

- బ్యాంకుల్లో రూ.2.5 లక్షలలోపు నగదును జమ చేసుకునేందుకు అనుమతించారు. కానీ ఖాతాలు లేని, ఖాతాలుండీ నిర్వహించే అలవాటు లేని వారి దగ్గర అంత డబ్బుంటే ఎలాగనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. పాలు, కూరగాయలు, గుడ్లు, చేపలు, మాంసం అమ్మే వారు నగదు లావాదేవీలే జరుపుతారు. అసంఘటిత రంగంలో వర్తక, వాణిజ్యాలన్నీ నగదుపైనే జరుగుతాయి. వారికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువైనా సరే బ్యాంకులో జమ చేసేందుకు అనుమతివ్వాలి. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసే వారిని శిక్షించే క్రమంలో ఇళ్లలో డబ్బు దాచుకునే సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు.

- పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బాగా దెబ్బతీసింది. దాంతో నిర్మాణ రంగం కూడా దెబ్బతిన్నది. దానిపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయారు. అందువల్ల ఉపాధి హామీ పథకం తరహాలో వారి ఉపాధికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలి.

- పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రాల ఆదాయం దెబ్బతింటున్నది. కేంద్రానికి రాష్ట్రాలు చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలపై కొంతకాలం మారటోరియం విధించాలి.

- నగదు కొరత తీర్చేందుకు రూ.500 నోట్లను ఎక్కువగా సరఫరా చేయాలి. మార్కెట్లలో రైతుల నుంచి ఉత్పత్తులు కొనే వ్యాపారులకు ఎక్కువ నగదు ఇచ్చేలా బ్యాంకులకు ఆదేశాలివ్వాలి.

- కనీస ఆదాయ పన్ను పరిమితిని రూ.2.5 లక్షల నుంచి మరింత పెంచాలి.

- భవిష్యత్తులో ఆన్‌లైన్, చెక్కుల ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల సంఖ్యను పెంచాలి.

- ప్రజలకు బ్యాంకింగ్ సర్వీసుల పట్ల అవగాహన కల్పించాలి. ప్రతీ వ్యక్తికి క్రెడిట్ హిస్టరీ ఉండేలా ఆదాయ, వ్యయాల నిర్వహణను అలవాటు చేయాలి.

ఆదాయ లోటు అంచనా (డిసెంబర్ నుంచి మార్చి 2017 వరకు)
వ్యాట్: రూ.2,600 కోట్లు
 రవాణా శాఖ: రూ.450 కోట్లు
 ఎక్సైజ్ శాఖ: రూ.200 కోట్లు


 

మరిన్ని వార్తలు