హైదరాబాద్: మహిళల గౌరవం పెంపొందించే దిశగా మహిళా దినోత్సవం నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తెలిపారు. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక ఏర్పాట్లపై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు.
వివిధ రంగాల్లో సేవలందించిన తెలంగాణ మహిళలకు పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు. పురస్కారాలు పొందే మహిళలను ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీను ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. అంతకు ముందు వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. వైద్య శాఖలో పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఇకపై ఆస్పత్రుల వారీగా నిర్వహణకు నిధులు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు.