బీర్‌ అయితనే బాగుంటది!

29 Apr, 2017 01:21 IST|Sakshi
బీర్‌ అయితనే బాగుంటది!

రాష్ట్రంలో భారీగా పెరిగిన వినియోగం
- మండుటెండల్లో నచ్చిన బీర్‌తో మందుబాబుల మజా
- ఒక్క ఏప్రిల్‌లోనే 40 లక్షల కేసుల బీర్లు అమ్మకం
- దక్షిణాదిన ఉత్పత్తి, అమ్మకాల్లో తెలంగాణ టాప్‌


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీర్లు పొంగి పొర్లుతున్నాయి. ఒకవైపు మండుటెండలు ఠారెత్తిస్తుండటం.. మరోవైపు 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలతో పెరుగుతున్న ఉక్కపోతతో మందుబాబులు రూటు మార్చా రు. వేసవి తాపాన్ని చల్లార్చుకునేందుకు బీరు బాట పట్టారు. నచ్చిన బీర్లతో మజా చేస్తున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో బీర్ల వినియోగం అనూహ్యంగా పెరిగింది. బీర్ల ఉత్పత్తి, అమ్మకాల్లో దక్షిణాదిలోనే తెలం గాణ అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్‌ నెల లోనే రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల కేసుల బీర్లు అమ్ముడవడం గమనార్హం. ఒక్కో కేసుకు 12 సీసాల చొప్పున మొత్తంగా 4.80 కోట్ల సీసాల బీరును మందుబాబులు గుటకాయస్వాహా చేసేశారు.

దక్షిణాదిలో తెలంగాణ నంబర్‌ వన్‌..
బీర్ల ఉత్పత్తి, వినియోగంలో తెలంగాణ దక్షి ణాదిలో నంబర్‌వన్‌గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,200 మద్యం దుకాణాలు, 1,300 వరకు ఉన్న బార్లలో బీర్ల అమ్మకాలు ఉప్పొంగాయి. ఏప్రిల్‌ అమ్మకాల్లో 9.11 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానాన్ని దక్కించుకుంది. తమిళనాడు, కర్ణాటక మూడు, నాలుగు స్థానాలను దక్కిం చుకున్నాయి. కేరళ ఐదో స్థానంలో నిలిచింది. ఏప్రిల్‌లో ఆయా రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాల్లో వృద్ధి, మందుబాబుల తలసరి బీరు వినియోగం ఇలా ఉంది.

ఉత్పత్తిలోనూ అగ్రభాగమే..
బీర్ల ఉత్పత్తిలోనూ తెలంగాణ దక్షిణాదిలో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రంలోని ఐదు బీర్ల ఉత్పత్తి సంస్థలు(బ్రూవరీస్‌) 17 రకాల పేర్లతో బీర్లను తయారు చేస్తున్నాయి. రాష్ట్రంలో నెలవారీగా సగటున 25–30 లక్షల కేసుల బీరు అమ్ముడవుతుంది. ఏప్రిల్‌లో మండుటెండలకు అదికాస్తా.. 40 లక్షల కేసులకు చేరింది. రాష్ట్ర అవసరాలకు సరిపడా బీర్లను ఉత్పత్తి చేయడంతోపాటు.. మరో 15 లక్షల కేసుల బీర్లను కేరళ, కర్ణాటక, ఏపీలకు ఎగుమతి చేస్తుండడం విశేషం. సాధారణ రోజుల్లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 65 శాతం.. బీర్ల అమ్మకాలు 35 శాతం ఉంటాయి. కానీ మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు.. బీర్ల అమ్మకాలు 50 శాతం ఉన్నట్లు ఆబ్కారీ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఏటేటా ఛీర్స్‌లో వృద్ధి..
మద్యం అమ్మకాల్లో రాష్ట్రంలో ఏటా పెరుగుదల నమోదవుతోంది. ఐదేళ్లుగా రాష్ట్రంలో కేసులకొద్దీ బీర్లు, మద్యాన్ని మందుబాబులు స్వాహా చేస్తున్నట్లు ఆబ్కారీ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది సుమారు రూ.12,706 కోట్ల విలువైన మద్యం, బీర్లను తాగేశారు. ఏటా వెయ్యి నుంచి రూ.2 వేల కోట్ల మేర అమ్మకాల్లో పెరుగుదల నమోదవుతోంది.

క్షణాల్లో బీ(రు)రెడీ..
ఇక బీర్ల వినియోగంలో గ్రేటర్‌ హైదరా బాద్‌ రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది. దేశ, విదేశాలకు చెందిన బీర్లతోపాటు మన కళ్లముందే క్షణాల్లో తయారుచేసి ఫ్రెష్‌గా ముందుంచే పలు బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు నగరంలో కొలువుదీరాయి. హైటెక్‌సిటీ, బంజారాల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఇవి అత్యధికంగా ఉండడం విశేషం. ఇటీవలికాలంలో 11 మినీ బ్రూవరీస్‌ సైతం సిటీలో ఏర్పాట య్యాయి. ఇక్కడ అమెరికా, మెక్సికో, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్‌ తదితర దేశాలకు చెందిన పలు బీర్ల వెరైటీలు లభ్యమవు తున్నాయి. రేంజ్‌ను బట్టి వీటి ధర రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఉంది.

మరిన్ని వార్తలు