పేరు రైతుది.. పవర్ హైదరాబాద్‌కా?

5 Nov, 2014 01:23 IST|Sakshi
పేరు రైతుది.. పవర్ హైదరాబాద్‌కా?

తెలంగాణ నేతలపై పరకాల ధ్వజం
* శ్రీశైలం విద్యుత్‌ను ఏ వ్యవసాయ క్షేత్రానికి తరలించారు?
* నగరంలో రెండున్నర గంటలు కోత పెట్టి వ్యవసాయానికి ఇవ్వొచ్చు.. అప్పుడు ఏ రైతూ ఆత్మహత్య చేసుకోడు
అవగాహన లోపంతోనే బాబుపై నిందలు

 
సాక్షి, హైదరాబాద్ : రైతుల పేరుతో తెలంగాణ నేతలు నానా యాగీ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ధ్వజమెత్తారు. రైతుల పేరు చెప్పి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కారు.. అందులో ఏ రైతుకైనా ఒక్క యూనిట్ ఇచ్చారా అని నిలదీశారు. 1,307 మిలియన్ యూనిట్ల అక్రమ విద్యుత్‌ను ఏ గోతిలో పోశారని ప్రశ్నిం చారు. రైతుల పేరు చెప్పి విద్యుత్‌ను హైదరాబాద్‌కే తరలిస్తున్నారన్నారు.

ఆ విద్యుత్‌ను ఏ వ్యవసాయ క్షేత్రానికి ఇచ్చారో తెలంగాణ ప్రజలు నిలదీయాలన్నారు. ఆయన మంగళవారం సచి వాలయంలో విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం విద్యుత్‌ను హైదరాబాద్‌కు సరఫరా చేసే బదులు రైతులకు అందిస్తే ఆత్మహత్యలు ఉం డేవి కాదన్నారు. నగరంలో రోజూ రెండున్నర గంటలు కోత విధించి, ఆ విద్యుత్‌ను వ్యవసాయానికి అందిస్తే ప్రయోజనం ఉండేదని, అప్పుడు ఏ రైతూ ఆత్మహత్య చేసుకోడని చెప్పారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ప్రభుత్వం ఈ పని చేసి ఉండేదన్నారు.
 
సీఈఆర్‌సీ నిర్ణయానికి కట్టుబడతాం
కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం విషయంలో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్ సీ) నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పరకాల చెప్పారు. ఇది ఏపీఈఆర్‌సీ పరిధిలోది కాదని ఆ సంస్థే తేల్చిందని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టు అయితేనే సీఈఆర్‌సీకి వెళ్లాలన్న విలేకరుల సందేహాన్ని ఆయన కొట్టిపారేశారు. కృష్ణపట్నం ప్రాజెక్టులో తెలంగాణకు వాటాలు మాత్రమే ఉన్నాయని, విద్యుత్ ఒప్పందాలు జరగలేదని తెలిపారు.

మరిన్ని వార్తలు